
పాపం సూర్య..
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. సూర్యను తప్పిస్తూ కోహ్లీ తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. అతనికి బదులు ఇంకెవరినైనా పక్కకు పెట్టాల్సిందన్నాడు. అతని 3-4 మ్యాచ్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఓ నిర్ణయంకు రావాలని టీమ్మేనేజ్మెంట్ను కోరాడు. 'కోహ్లీ నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఈ సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు సరైనవి కావు. సూర్యకుమార్కు ఎలాంటి గాయాలు లేవు. అతని బ్యాటింగ్ తీరు చూసిందీ లేదు. మరి అలాంటపుడు అతడిని ఎలా పక్కకు పెడతారు.

గాయాలైతే లేవు..
ప్రపంచకప్ సమయంలో ఒకవేళ నాలుగు, ఐదో స్థానంలో ఎవరైన గాయపడితే అతడికి బ్యాకప్ ప్లేయర్ ఉండాలి కదా. ఉదాహరణకు శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరనేది ఆలోచించారా?. ఇప్పటికే ఆ స్థానంలో మరో ఆటగాడిని ప్రయత్నించాలి. ఒక మూడు, నాలుగు మ్యాచ్లు సూర్యకు అవకాశం ఇచ్చి అతడు ఎలా ఆడతాడో చూడాలి. ఒకవేళ అతడు మెరుగైన ప్రదర్శన చేస్తే నాలుగో స్థానంలో ఓ బ్యాట్స్మెన్ దొరికినట్లే కదా. ప్రపంచకప్నకు ఇప్పటినుంచే సన్నద్ధత అవసరం.

ఇది ప్రిపరేషన్లా లేదు..
కాబట్టి టీమ్ సెటప్లో ఉన్న ఇతర ఆటగాళ్లను ఎవరినైనా పక్కనపెట్టండి. మనం తరుచూ ప్రపంచకప్ సన్నాహకాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇది ప్రపంచకప్ ప్రిపరేషన్లా లేదు. కేవలం కొన్నేళ్లుగా రాణిస్తున్న మాజీ ఆటగాళ్లకు అండగా నిలుస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.'అని గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.
శ్రేయస్ అయ్యర్తో ఐదో స్థానం కోసం సూర్య కుమార్ యాదవ్ పోటీపడుతున్నాడు. ఫస్ట్ టీ20లో 67 పరుగులతో ఆకట్టుకున్న శ్రేయస్.. తర్వాత మ్యాచ్ల్లో వరుసగా 8, 9 పరుగులతో నిరాశపర్చాడు. దీంతో అతని స్థానంలో సూర్యకు అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ స్థానంలో ఓ బ్యాకప్ ప్లేయర్ ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఇంగ్లండ్ ఈజీ విక్టరీ..
ఇక మూడో టీ20లో మార్క్ వుడ్ వేగం ముందు బ్యాట్స్మెన్ తలవంచగా... పసలేని బౌలింగ్తో పాటు పేలవ ఫీల్డింగ్తో భారత్ చిత్తుగా ఓడింది. సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 8 వికెట్లతో ఘన విజయాన్నందుకొని సిరీస్లో 2-1తో ముందంజలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్స్టో (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్ ఇదే వేదికగా గురువారం జరుగుతుంది.


Click it and Unblock the Notifications
