
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్పంత్(23 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 21).. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో రివర్స్ స్కూప్ షాట్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ బంతి సిక్సర్గా దూసుకెళ్లడంతో అటు అభిమానులే కాకుండా ఇటు మాజీ క్రికెటర్లు సైతం ఆ షాట్కు మంత్రముగ్ధులయ్యారు. ఇప్పుడా షాట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మాజీ క్రికెటర్లతో సహా అభిమానులు పంత్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ సైతం రిషభ్ పంత్ను మెచ్చుకున్నాడు. అతను ఆడింది సాహసోపేతమైన షాటే కాకుండా కచ్చితమైన లెక్కతో కూడినదని కొనియాడాడు.
స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో సంజయ్ బంగర్తో మాట్లాడిన ఈ బీజేపీ ఎంపి.. పంత్ షాట్ను ప్రశంసించాడు. 'అదో అద్భుతమైన షాట్. సాహసోపేతమైనది కూడా. టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోగా.. పంత్ త్వరగా క్రీజులోకి వచ్చాడు. ఆర్చర్ బౌలింగ్లో కచ్చితమైన లెక్కతో ఆడిన షాట్ అది. థర్డ్ మ్యాన్ లేనప్పుడు డీప్స్క్వేర్ లెగ్, ఫైన్లెగ్లో ఫీల్డర్లు ఉండగానే మంచి షాట్ ఆడాడు' అని గంభీర్ వివరించాడు. కాగా, పంత్ ఇలాంటి స్కూప్ షాట్ ఆడడం ఇటీవల ఇది రెండోసారి. ఇదివరకు ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులోనూ అండర్సన్ బౌలింగ్లో ఇలాంటి రివర్స్ స్కూప్ షాటే ఆడాడు. దానికన్నా ఇప్పుడు ఆడిన షాట్ బాగుందని క్రికెట్ విశ్లేషకులు అభినందిస్తున్నారు.
ఇండియా ఇన్నింగ్స్ 3వ ఓవర్లో 5వ బంతిని పంత్ మొత్తం మొకాళ్ల మీదకు వంగి రివర్స్ స్కూప్లో బ్యాట్ను పైకిలేపి థర్డ్మన్ దిశగా గాల్లోకి లేపాడు. అంతే సెకన్ల వ్యవధిలో బంతి బౌండరీ లైన్ బయట పడింది. పంత్ షాట్కు ఆర్చర్ కాసేపు షాక్ అయ్యాడు.. కచ్చితంగా అతని మదిలో అండర్సన్ గర్తుకు వచ్చే ఉంటాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే అదే జోరులో బెన్ స్టోక్స్ బౌలింగ్లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.