అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన డే/నైట్ టెస్ట్కు ఆతిథ్యమిచ్చిన మొతెరా స్టేడియం పిచ్పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అసలు టెస్ట్ మ్యాచ్కు ఇలాంటి వికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం మొతెరా వికెట్ను తప్పుబట్టడానికి లేదన్నాడు. బ్యాట్స్మెన్ అతిగా డిఫెన్స్కు పోవడం వల్లే వికెట్లు ఇచ్చుకున్నారని స్పష్టం చేశాడు.
మరోపక్క ఈ పిచ్ టెస్ట్లకు సూటవ్వదని అందుకే భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే ఆలౌటైందని మాజీ క్రికెటర్, సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. కాగా, ఇలాంటి వికెట్పై ఆడితే అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ టెస్ట్ల్లో వరుసగా 1000, 800 వికెట్లు సులువుగా తీసేవారని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
మొతెరా పిచ్ టెస్ట్లకు ఏ మాత్రం సూటవ్వదని హర్భజన్ సింగ్ అన్నాడు. ఒకవేళ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 200పైగా పరుగులు చేసుంటే అప్పుడు భారత్ కష్టపడేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా, ఇక మీద కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ప్రతీ జట్టును మూడు ఇన్నింగ్స్లు ఆడించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఇలాంటి పిచ్ వల్ల బ్యాట్స్మెన్ స్కిల్స్కు పరీక్ష ఎదురవుతుందని, ఇది ఈ ఒక్క మ్యాచ్కు అయితే ఓకే కానీ తర్వాత కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ఏ క్రికెటర్ కూడా ఒప్పుకోడని ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు.
భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ (25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.