
ఓవల్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. దాంతో ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. చివరి రోజు ఆటకు సంబంధించిన టికెట్లు ఒక్కసారిగా ఎగబడటంతో టికెట్లన్నీ హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి.
దాంతో ఓవల్ మైదాన నిర్వాహకులు మైదానం ముంగిట హౌస్ఫుల్ బోర్డులు పెట్టడంతో బ్లాక్ మార్కెట్కు తెరలేసింది. ఒక్కో టికెట్ నాలుగు, ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడువుతున్నాయి. అయినా టికెట్ దొరకలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇక ఇంగ్లండ్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలించారు. ఈ క్రమంలోనే మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.
అయితే టీమిండియాలో మాత్రం కరోనా కలకలం రేగింది. హెడ్ కోచ్ రవిశాస్త్రి వైరస్ బారినపడ్డాడు. దాంతో బీసీసీఐ మెడికల్ టీమ్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్లను హోటల్ గదుల్లోనే ఐసోలేషన్కు తరలించింది. మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇచ్చేవరకు వారు ఐసోలేషన్లోనే ఉంటారని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. జట్టులోని ఇతర సిబ్బంది, ఆటగాళ్లందరికీ రెండు సార్లు పరీక్షలు నిర్వహించామని అందరికి నెగటీవ్ రావడంతోనే నాలుగో రోజు ఆటకు అనుమతిచ్చామని స్పష్టం చేసింది.
తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్తో సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్), హసీబ్ (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 60) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 4 ఫోర్లతో 50) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు.