ఇంగ్లండ్ బీ టీమ్పై గెలిచిన..
తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ భారత విజయాన్ని ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ బీ టీమ్పై భారత్ విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఓవైపు భారత్ను అంటూనే మరోవైపు ఇంగ్లండ్ టీమ్ సెలెక్షన్ను తప్పుబట్టాడు. భారత్.. ఇంగ్లండ్ పూర్తి స్థాయి జట్టుపై గెలవలేదని చెప్పకనే చెప్పాడు. 'ఇంగ్లండ్ బీ టీమ్పై విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు'అని హిందీలో ట్వీట్ చేశాడు. ఇక సెకండ్ టెస్ట్కు గాయంతో జోఫ్రా ఆర్చర్ దూరం కాగా.. రొటేషన్ పాలసీలో భాగంగా జేమ్స్ అండర్సన్, జోస్ బట్లర్కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
భారత్ బీ టీమ్ దెబ్బ మరిచిపోయావా?
ఇక పీటర్సన్ ట్వీట్పై భారత అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ జట్టుపై గెలిచినా.. గెలుపు గెలుపేనని, పూర్తి స్థాయి జట్టుతో ఆడకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తమ బీ టీమ్ ఇంకా బలంగా ఉంటుందని, ఆస్ట్రేలియా ఫలితాన్ని మరిచిపోయావా? అని చురకలేస్తున్నారు. ఓటమికి సాకులు చెప్పడం మాని.. తదుపరి మ్యాచ్కైనా సంసిద్దం కావాలని సూచిస్తున్నారు. ఇంకొంతమందైతే.. బర్నాల్ రాసుకోమని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం కెవిన్ పీటర్సన్ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

సిరీస్ సమం..
ఇక సెకండ్ టెస్ట్ విషయానికి వస్తే.. అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ సుదీర్ఘ ఫార్మాట్లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో విజృంభించిన.. అక్షర్ (5/60), అశ్విన్ (3/53) మరోసారి చెలరేగారు. 53/3 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు మంగళవారం ఆట మొదలెట్టిన ఇంగ్లండ్ మరో 111 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. కుల్దీప్ యాదవ్కు రెండు వికెట్లు దక్కాయి.


Click it and Unblock the Notifications
