
అసలు విషయం ఏంటంటే..?
భారత్ ఇన్నింగ్స్ 75వ ఓవర్లో స్పిన్నర్ జాక్ లీచ్ డెలివరీ రహానే గ్లౌజులను తాకుతూ ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో ఉన్న ఓలీ పోప్ చేతుల్లో పడింది. ఇంగ్లండ్ చేసిన ఈ అప్పీల్ను ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కెప్టెన్ రూట్ రివ్యూకు వెళ్లాడు. టీవీ రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరీ కూడా పొరపాటు చేశారు. ఆయన పూర్తి ఫుటేజీని పరిశీలించకుండా నిర్ణయం తీసుకున్నాడు. తొలుత బ్యాట్కు బంతి తగలేదని తేల్చి నాటౌటివ్వగా.. ఇంగ్లండ్ ఎల్బీని పరిశీలించమని కోరింది.
దాంతో మరోసారి పరీక్షించిన అనిల్ చౌదరీ బంతి ఔట్ సైడ్ పిచ్ అయిందని నాటౌటిచ్చాడు. కానీ బంతి రహానే ప్యాడ్స్కు తాకిన అనంతరం గ్లౌవ్స్కు తాకినట్లు రిప్లేలో స్పష్టమైంది. దీనిపై అప్పుడే రూట్ గ్లౌజులను తాకుతూనే వెళ్లిందిగా అన్నట్లు సంజ్ఞలు చేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. మొత్తానికి రివ్యూ సఫలం కాకపోవడంతో ఒక రివ్యూను ఇంగ్లండ్ కోల్పోయింది. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ థర్డ్ అంపైర్ తప్పిదాన్ని తెలుసుకొని ఇంగ్లండ్ రివ్యూను పునరుద్ధరించారు.

ఒకే పరుగుకు ఔటయ్యాడు..
అయితే ఈ నిర్ణయం తర్వాత రహానే ఒకే పరుగు జోడించి ఔటయ్యాడు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా అతను మరింత భారీ స్కోర్ సాధించి ఉంటే ఇంగ్లండ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. అంపైర్ అనిల్ చౌదరీపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యేవి. అయితే, ఇది ఫుటేజీ టెక్నికల్ ఎర్రర్ అని, అంపైర్కు పూర్తి ఫుటేజి చూపించకపోవడం వల్లే ఇలా జరిగిందని కొంత మంది థర్డ్ అంపైర్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఎన్నో అంతర్జాతీయ వన్డే, టీ20లకు అంపైరింగ్ చేసిన అనిల్ చౌదరికి ఇది రెండో టెస్ట్ మాత్రమే.

ఫ్యాన్స్ ఫైర్..
ఇక అనిల్ చౌదరీ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఫన్నీ మీమ్స్తో సెటైర్లు పేల్చారు. థర్డ్ అంపైర్ అలా ఎలా చూడకుండా ఉంటాడని గ్లేన్ మ్యాక్స్వెల్ ప్రశ్నించగా.. థర్డ్ అంపైర్ అలిసి పోయినట్లున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. క్రికెట్లోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐకి డీఆర్ఎస్ సాంకేతికతకు కావాల్సిన పూర్తి పరికరాలు లేవని ఓ అభిమాని సెటైరిక్గా కామెంట్ చేశాడు. అంపైర్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మరొకరు ఆరోపించారు.

రోహిత్ విషయంలోనూ..
అంతకు ముందు రోహిత్ శర్మ స్టంపౌట్ విషయంలోనూ అనిల్ చౌదరి తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ.. బంతి దొరక్కపోవడంతో స్టంపౌటయ్యాడు. బంతి మిస్ అవగానే పాదాన్ని క్రీజులో ఉంచేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. అప్పటికే ఇంగ్లండ్ కీపర్ బెన్ ఫోక్స్ బెయిల్స్ ఎగరగొట్టాడు. అయితే రోహిత్ శర్మ క్రీజు లైన్పై తన కాలును ఉంచాడు. కొంచెం క్లిష్టమైన ఈ సమీక్షను బెన్ఫిట్ ఆఫ్ బ్యాట్స్మన్ కింద అనిల్ చౌదరీ నాటౌటిచ్చాడు. ఇది కూడా విమర్శలకు దారితీసింది.


Click it and Unblock the Notifications












