
అహ్మదాబాద్: జోస్ బట్లర్(52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 83 నాటౌట్) పరుగుల విధ్వంసం సృష్టించడంతో సెకండ్ టీ20 ఓటమికి ఇంగ్లండ్ బదులు తీర్చుకుంది. మొతేరా మైదానం వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా చెలరేగిన ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్ ) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(25) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(3/31) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. బట్లర్కు తోడుగా జానీ బెయిర్ స్టో(28 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో చాహల్(1/41), సుంధర్ (1/26) చెరొక వికెట్ పడగొట్టారు.
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ జాసన్ రాయ్(9) వికెట్ త్వరగా కోల్పోయినా.. జోస్ బట్లర్ సూపర్ ఇన్నింగ్స్తో సునాయస విజయాన్నందుకుంది. ఇక బ్యాటింగ్లో తడబడిన కోహ్లీసేన.. పేలవ బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బట్లర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. నాలుగో టీ20 ఇదే వేదికగా గురువారం(మార్చి 18న) జరగనుంది.