
అహ్మదాబాద్: భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్కు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామన్నాడు. ఇక మళ్లీ టాస్ ఓడటంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇలాంటి సవాళ్లను స్వీకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నాడు. గత మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని, తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో సత్తాచాటుతామని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయన్న విరాట్.. గాయంతో ఇషాన్ కిషాన్ దూరమవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చాడన్నాడు. ఇక తప్పని పరిస్థితుల్లో యుజ్వేంద్ర చాహల్ స్థానంలో రాహుల్ చాహర్ను తీసుకున్నామన్నాడు.
గత మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్కు టీమిండియా మరో అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ను నిలుపుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉండగా.. జోరు కొనసాగించాలని ఇంగ్లండ్ తహతహలాడుతున్నది. మూడో టీ20లో ఓడి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-2తో వెనుకబడ్డ కోహ్లీసేన మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. 2-2తో సమం చేసి సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్కు తీసుకెళ్లాలని కసితో ఉంది.
పవర్ప్లేలో ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ ఎక్స్ప్రెస్ బంతులకు చతికిలపడుతున్న భారత బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో దీటైన జవాబివ్వాల్సిన అవసరం ఉంది. సిరీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన తొలి, మూడో మ్యాచ్ల్లో మొదటి ఆరు ఓవర్లలో సరైన స్కోర్లు రాకపోవడం ఓటములకు ప్రధాన కారణమైంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్లే గెలిచాయి. రెండో టీ20లో లక్ష్యఛేదనలో అదరగొట్టిన టీమిండియా సైతం తదుపరి పోరులో మంచి లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమైంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా భారీ స్కోర్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తుది జట్లు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ యాదవ్, రాహుల్ చాహర్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్స్టో, స్టోక్స్, స్యామ్ కరన్, ఆర్చర్, రషీద్, వుడ్, జోర్డాన్.