
పుణె: భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ పరిస్థితుల నేపథ్యంలో తాము మళ్లీ ఫీల్డింగ్కు మొగ్గు చూపామని ఇంగ్లండ్ తాత్కలిక సారథి జోస్ బట్లర్ తెలిపాడు. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. మోర్గాన్ స్థానంలో డేవిడ్ మలాన్, సామ్ బిల్లింగ్స్ ప్లేస్లో లియమ్ లివింగ్టన్, మార్క్ వుడ్ స్థానంలో రీస్ టోప్లీ తుది జట్టులోకి వచ్చాడన్నాడు.
ఈ సిరీస్లో వరుసగా రెండో సారి టాస్ ఓడిన కోహ్లీ.. తాము కావాలనుకున్నది కూడా బ్యాటింగేనని స్పష్టం చేశాడు. జట్టులో ఒక మార్పే చోటు చేసుకుందని, గాయంతో దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడన్నాడు. ఇక అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేస్తాడని అందరూ భావించినా.. అతనికి మరోసారి నిరాశే ఎదురైంది. ఫస్ట్ వన్డేలో దారుణంగా విఫలమైన కుల్దీప్ యాదవ్కు టీమ్మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది.
ఇక ఒకదాని తర్వాత మరొకటి ఇంగ్లండ్పై టెస్ట్, టీ20 సిరీస్లను గెలిచిన టీమిండియా మరో భారీ విజయంపై కన్నేసింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచింది. టాప్ క్లాస్ పెర్ఫామెన్స్తో చెలరేగుతున్న కోహ్లీసేన సిరీస్ విజయమే లక్ష్యంగా శుక్రవారం జరిగే సెకండ్ వన్డేకు సిద్దమైంది. పర్యాటక జట్టును రిక్తహస్తాలతోనే ఇంటిదారి పట్టించాలనే లక్ష్యంతో ఉంది.
మరోవైపు అన్నింటా దెబ్బతిన్న ఇంగ్లండ్ ఆఖరి సిరీస్తోనైనా స్వదేశానికి పయనం కావాలనుకుంటోంది. రెండో మ్యాచ్లో గెలిచి తుదిపోరుదాకా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే రసవత్తరంగా జరిగే అవకాశముంది. కోహ్లిసేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటే ..పర్యాటక జట్టు ఒత్తిడిలో ఉంది. కెప్టెన్ మోర్గాన్ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం కావడం ఆ జట్టుకు మరో దెబ్బ.
తుది జట్లు:
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, పంత్, రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, కుల్దీప్, ప్రసిధ్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, బెయిర్ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్స్టోన్, మొయిన్, స్యామ్ కరన్, టామ్ కరన్, రషీద్, టోప్లీ.