
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్టార్స్ వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలకు ఆట పట్ల అంకితభావం లేదని ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ విమర్శించాడు. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన జంబో జట్టులో ఈ ఐపీఎల్ ఆటగాళ్లకు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో వీరిద్దరూ విఫలమయ్యారు. రెండు సార్లు అవకాశమిచ్చినా అర్హత సాధించలేకపోయారు. దాంతో భారత్ తరఫున ఆడే సువర్ణవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి గురించి తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడిన బ్రాడ్ హగ్.. వీరికి ఇదే చివరి అవకాశం కావచ్చని అభిప్రాయపడ్డాడు. 'అంతర్జాతీయ క్రికెట్లో ఆడడానికి కావాల్సిన శక్తిసామర్థ్యాలు సాధించడంలో రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి విఫలమయ్యారు. వారికి ఆట పట్ల అంకితభావం లేదు. ఎందుకంటే టీమిండియా నిర్దేశించిన ఫిట్నెస్ టెస్ట్లో వాళ్లు విఫలమయ్యారు. ఇదే వారికి చివరి అవకాశం కావొచ్చు. దీంతో అక్కడున్న యువత.. మీకేం కావాలనే విషయంపై స్పష్టంగా ఉండాలి. మీరు ఎంచుకున్న రంగంలో రాణించడానికి అక్కడికి చేరుకోడానికి తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకోవాలి. అందుకు కావలసిన నైపుణ్యాలు సంపాదించుకోవాలి' అని బ్రాడ్ సూచించాడు.
ఈ యువ క్రికెటర్లకు వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని, దాంతో ఇదే వారికి చివరి అవకాశం కావచ్చని ఈ ఆసీస్ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. కాగా, కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఇలా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారడం రెండోసారి. గత సీజన్ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తికి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీ20 జట్టులో చోటు దక్కింది. కానీ గాయం కారణంగా అతను వెళ్లలేకపోయాడు. ఇప్పుడు రెండోసారి దక్కిన అవకాశం ఫిట్నెస్ టెస్ట్ వల్ల దూరమైంది.