రిస్క్ తక్కువే కాబట్టి..
సిరీస్లో 2-1తో లీడ్లో ఉన్న టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే నాలుగో టెస్ట్ను కనీసం డ్రానైనా చేసుకోవాలి. ఒకవేళ ఓటమిపాలైతే లార్డ్ వేదికగా న్యూజిలాండ్తో జూన్ 18న జరగనున్న ఫైనల్కు ఆస్ట్రేలియా అర్హత సాధిస్తుంది. దాంతోనే మార్చి 4 నుంచి మొతేరా వేదికగానే జరిగే ఈ మ్యాచ్ కోసం స్పిన్ వికెట్ గురించి బోర్డు పెద్దలు ఆలోచనే చేయడం లేదని తెలుస్తోంది. పిచ్కు సంబంధించినంత వరకూ హోమ్టీమ్కు చాలా తక్కువ రిస్క్ ఉండేలా చూసుకుంటున్నారని సమాచారం.
ఇంగ్లండ్ ఫిర్యాదు చేయలేదు..
'పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. బౌన్స్ కూడా లభిస్తుంది. ఒకే వేదికగా రెండు మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఒక టెస్టు ఫలితంతో నిర్ణయానికి రావద్దు. ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ ఇచ్చిన రిపోర్ట్తో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఐసీసీ నిర్ణయిస్తుంది. పిచ్పై ఇప్పటివరకు ఇంగ్లండ్ జట్టు ఎలాంటి ఫిర్యాదు కూడా ఇవ్వలేదు'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
ముందే ఊహించాం..
''గులాబి టెస్టు బాగానే సాగింది. అయితే ఇంగ్లండ్ మాజీలు పిచ్పై బంతి ఎక్కువగా గింగరాలు తిరిగిందని వ్యాఖ్యలు చేశారు. పిచ్ వల్లనే ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. కానీ, నేరుగా వచ్చిన బంతులకే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎక్కువగా ఔటయ్యారు. బీసీసీఐ వీటిని ముందే ఊహించింది'' అని వెల్లడించారు.
వచ్చే సీజన్ ఐపీఎల్తో పాటు టీ20 ప్రపంచకప్ మ్యాచ్లకు కూడా మొతెరా స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉండడంతో మరోసారి దుమ్మురేపే పొడి పిచ్ను సిద్దం చేసి విమర్శల పాలవ్వకూడదని టీమ్ మేనేజ్మెంట్తో పాటు బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.