
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ మధ్య నరేంద్రమోదీ స్డేడియం వేదికగా జరుగుతున్న డే/నైట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్లో స్పిన్నర్ల హవానే కొనసాగుతోంది. తొలి రోజు ఆటలో 11 వికెట్లు తీసిన స్పిన్నర్లు రెండో రోజు కూడా బంతితో బ్యాట్స్మెన్ను వణికిస్తున్నారు. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో మిగిలిన ఏడు వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. ఇంగ్లండ్ కెప్టెన్ పార్ట్టైమ్ స్పిన్నర్ జోరూట్ (5/8) కెరీర్ బెస్ట్ బౌలింగ్తో భారత్ పతనాన్ని శాసించాడు.
అయితే ఆ వెంటనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్కు అక్షర్ పటేల్ ఫస్ట్ ఓవర్లోనే గట్టి షాక్ ఇచ్చాడు. తొలి బంతికే జాక్ క్రాలీ(0) క్లీన్ బౌల్డ్ చేసిన అక్షర్.. సెకండ్ బాల్కు జానీ బెయిర్ స్టోను వికెట్ల ముందు బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. స్వీప్ షాట్ ఆడబోయిన బెయిర్ స్టో.. బంతి అంచనా వేయడంలో విఫలమవడంతో శరీరానికి తగిలింది. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. అయితే బెయిర్ స్టో రివ్యూకెళ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
రిప్లేలో బంతి వికెట్లను మిస్సవ్వడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కానీ ఆ మరుసటి బంతికే బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన జోరూట్(5 బ్యాటింగ్)తో మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(5 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ముందుకు నడిపిస్తున్నాడు. లోకల్ బాయ్ అక్షర్ పటేల్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ తెగ ఇబ్బంది పడుతున్నారు.
అంతకుముందు 99/3 ఓవర్నైట్ స్కోర్తో సెకండ్ డే ఆటను కొనసాగించిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్లో 145 పరుగులకు ఆలౌటైంది. దాంతో కోహ్లీసేనకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.