
సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ లైనప్ ఖారారైంది. మంగళవారం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన గ్రూప్-బి ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడుకుండానే రద్దయింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఫలితంగా సౌతాఫ్రికా గ్రూప్-బి టాపార్గా నిలవగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక గ్రూప్-ఎలో నాలుగు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. మూడు విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంతో నాకౌట్కు అర్హత సాధించాయి.
దీంతో గ్రూప్-ఎ టాపరైన భారత్ సెమీస్లో గ్రూప్-బి సెకండ్ టీమ్ ఇంగ్లండ్తో తలపడనుండగా.. సౌతాఫ్రికాను ఆస్ట్రేలియా ఢీకొట్టనుంది. ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్లు గురువారం జరగనున్నాయి. తొలి సెమీస్ భారత్ -ఇంగ్లండ్ మధ్య ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవ్వనుండగా.. సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ మధ్యాహ్నం 1.30 గంటలకు షురూ కానుంది.
వామ్మో ఇంగ్లండ్..?
సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కావడమే భారత అభిమానులను కలవర పెడుతోంది. 2018 టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లండ్తోనే తలపడ్డ భారత్.. 8 వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారిపట్టింది. 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇంగ్లీష్ జట్టు భారత్ ఓడించింది. అందుకే.. సెమీస్లో ఇంగ్లండ్ ప్రత్యర్థి కావద్దని అందరూ భావించారు. ఇక ఇంగ్లండ్పై భారత్ రికార్డు కూడా బాలేదు. ఇంగ్లీష్ జట్టుతో భారత్ 19 టీ20ల్లో తలపడగా.. కేవలం 4 గెలిచి 15 ఓడిపోయింది. విజయాల శాతం 21.05 మాత్రమే. గతేడాది మార్చిలో ఇంగ్లండ్ గువాహటిలో పర్యటించి హర్మన్ సేనను 0-3తో వైట్వాష్ చేసింది. ఇక ప్రపంచకప్ ముందు జరిగిన ముక్కోణపు సిరీసులోనూ 2 మ్యాచుల్లో పైచేయి సాధించింది.