
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఇంగ్లండ్పై టీమిండియా టీ20 సిరీస్ గెలిస్తే అక్షర్ పటేల్ ధరించే కళ్లద్దాలలాంటివి పెట్టుకుని ఫొటో షేర్ చేస్తానని ఇటీవల చెప్పిన ఆయన.. తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నారు.అయితే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించాక మహీంద్ర ఓ ట్వీట్ చేశారు.
ఆ మ్యాచ్లో అక్షర్ పటేల్ పెట్టుకున్న కళ్లద్దాలు బాగున్నాయని, ఆ విజయాన్ని ఆస్వాదించడానికి తనకు ఆ గాగుల్స్ కావాలని చెప్పారు. అవి ఏ బ్రాండ్, ఎక్కడ దొరుకుతాయని కూడా నెటిజెన్లను అడిగారు. ఈ క్రమంలోనే మళ్లీ భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 సందర్భంగా ఇంకో ట్వీట్ చేశారు. 'అక్షర్ షేడ్స్' లాంటి కళ్లద్దాలు తెచ్చుకున్నానని పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్కు ఓ అభిమాని మహీంద్రను ఒక ఫొటో పంచుకోమని కోరగా.. టీమిండియా టీ20 సిరీస్ కూడా గెలిస్తే తప్పకుండా పెట్టుకుంటానని బదులిచ్చారు.
ఇక తాజాగా టీమిండియా ఐదో టీ20లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడంతో ఆనంద్ మహీంద్ర మాటను నిలబెట్టుకున్నారు. ''ఇప్పుడు నా మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఇదిగో నేను చెప్పినట్లే 'అక్షర్ షేడ్స్'తో సెల్ఫీ తీసుకొని మీతో పంచుకుంటున్నా.'' అని మహీంద్ర కళ్లద్దాలతో విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫొటోను షేర్ చేశారు.
క్రికెట్ను బాగా ఫాలో అయ్యే ఆనంద్ మహీంద్ర.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన యువ క్రికెటర్లకు తమ సరికొత్త ఎస్యూవీ 'థార్'ను బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీసను భారత జట్టు గెలుచుకోవడంలో కీలక భూమిక పోషించిన అరంగేట్ర ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శుభమన్ గిల్, నవ్దీప్ సైనీతోపాటు శార్దూల్ ఠాకూర్కు కూడా ఈ బహుమతి అందజేసారు. ఇక టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్ను టెస్ట్, టీ20 సిరీస్ల్లో ఓడించగా.. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లోనూ చిత్తు చేయాలని చూస్తోంది.