India vs England: భారత్ గెలవాలంటే.. రోహిత్ శర్మతో సహా ఆ ఇద్దరిపై వేటు వేయాలి!

హైదరాబాద్: సరిగ్గా మూడు వారాల కిందట ఇదే మంగళవారం ఆస్ట్రేలియాతో గబ్బా టెస్ట్లో కుర్రాళ్లతో కూడిన భారత్ అసాధారణ పోరాట పటిమతో అనూహ్య విజయం సాధించి బోర్డర్-గావస్కర్ ట్రోఫిని కైవసం చేసుకున్నప్పుడు యావత్ దేశం ఎంతో గర్వించింది. స్వదేశం చేరిన ఆటగాళ్లపై పూల వర్షం కురిపించింది. ఆ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందని అంతా భావించారు. కానీ మూడు వారాల్లోనే సీన్ రివర్సైంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగొచ్చినా.. బుమ్రా, ఇషాంత్ వంటి సీనియర్లు మళ్లీ బరిలో నిలిచినా.. సొంతగడ్డపై ఆడుతున్నా.. కూడా ఇంగ్లండ్తో ఫస్ట్ టెస్ట్లో భారత్కు ఘోర ఓటమి తప్పలేదు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై 420 వరల్డ్ రికార్డు కష్టమే అయినా కోహ్లీ సేన కనీసం డ్రాతో గట్కెక్కే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా 227 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది.
అయితే ఇదే చెన్నై వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించాలంటే తుది జట్టులో మార్పులు జరగాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను మార్చాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

కుల్దీప్ రావాల్సిందే..!
ఫస్ట్ టెస్ట్లో అశ్విన్కు అండగా నిలిచే రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అశ్విన్ కట్టడిగా బౌలింగ్ చేసినా సహచర స్పిన్నర్లు అయిన వాషింగ్టన్ సుందర్, షెబాజ్ నదీమ్ దారుణంగా విఫలమయ్యారు. కెరీర్లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న ఈ ఇద్దరు దారళంగా పరుగులిచ్చుకున్నారు. నదీమ్ 59 ఓవర్లలో 233 పరుగులిచ్చుకొని నాలుగు వికెట్లు తీశాడు. అదే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ జాక్ లీచ్ 50 ఓవర్లలో 181 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కీలక రోహిత్, పుజారా వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు.
కాబట్టి నదీమ్ స్థానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గత కొంత కాలంగా బెంచ్కే పరిమితమవుతున్న కుల్దీప్.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. పైగా అతను చివరి సారిగా ఆడిన టెస్ట్లో 5 వికెట్లు తీశాడు. కాబట్టి అతను జట్టులోకి వస్తే మేలు జరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

భారమైన రోహిత్ శర్మ..
ఫస్ట్ టెస్ట్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 18 పరుగులు చేశాడు. అంతేకాకుండా గత 8 ఇన్నింగ్స్ల్లో రోహిత్ ప్రదర్శన అంత ఆశాజనకంగా ఏం లేదు. ఆరుసార్లు 30లోపే ఔటవ్వగా.. మూడు సార్లు అయితే కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా అందుకోలేదు. కాబట్టి అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ను తీసుకోవడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు. రోహిత్ కన్నా స్వదేశంలో మయాంక్ రికార్డు బాగుందంటున్నారు.
రోహిత్ 22 ఇన్నింగ్స్ల్లో 6 సెంచరీలు 79 సగటుతో పరుగులు చేశాడని, మయాంక్ 6 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 99.50 సగటుతో రాణించాడని గుర్తు చేస్తున్నారు. సెకండ్ టెస్ట్లో కూడా అగర్వాల్ చెలరేగితే భారత్ సునాయసంగా విజయం సాధిస్తుందని చెబుతున్నారు.

ఫామ్లో లేని రహానే..
'కెప్టెన్గా రహానే ఒకే.. బ్యాట్స్మెన్గా జట్టుకు భారమయ్యాడు.' ఇంగ్లండ్తో ఫస్ట్ టెస్ట్ అనంతరం రహానే గురించి ప్రముఖ కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్. ఈ మాటల్లోనే అతను జట్టుకు ఎంత భారమయ్యాడో స్పష్టంగా అర్థం అవుతుంది. ఆసీస్ పర్యటనలో మెల్బోర్న్ సెంచరీ తర్వాత రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. గత 14 ఇన్నింగ్స్లో మెల్ బోర్న్ సెంచరీ మినహా అతని అత్యధిక స్కోర్ 46. 6 సార్లు 10 పరుగుల లోపే ఔటయ్యాడు.
ఫామ్లేక సతమతమవుతున్న రహానే స్థానంలో కేఎల్ రాహుల్ను తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా స్వదేశంలో రహానే కంటే కేఎల్ రాహుల్కు మంచి రికార్డు ఉంది. స్వదేశంలో రహానే 37.35 పరుగులతో రాణించగా.. కేఎల్ రాహుల్ 44.25 పరుగులు చేశాడు. 22 ఇన్నింగ్స్ల్లో రాహుల్ 9 హాఫ్ సెంచరీలు చేయగా.. రహానే 44 ఇన్నింగ్స్లో 11 హాఫ్ సెంచరీలు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications