
సూర్య X పంత్..
బ్యాటింగ్ పరంగా చూసుకుంటే టీమిండియాకు తిరుగులేదు. ముఖ్యంగా ఫామ్లేమితో తంటాలు పడ్డ శిఖర్ ధావన్ టచ్లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా హిట్టయితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. గత మ్యాచ్లో మోచేతి గాయానికి గురైన 'హిట్మ్యాన్' పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. టాపార్డర్లో కోహ్లి, మిడిలార్డర్లో రాహుల్, పాండ్యా బ్రదర్స్ (హార్దిక్, కృనాల్)తో బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా క నిపిస్తోంది. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. లేదంటే రిషభ్ పంత్పై నమ్మకముంచితే సూర్య అరంగేట్రం ఆలస్యం కావొచ్చు. ఇంగ్లాండ్తో టీ20ల్లోనే అరంగేట్రం చేసి గొప్పగా రాణించిన సూర్యను వన్డేల్లోనూ తీసుకోవాలనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పంత్ను ప్రత్యేక బ్యాట్స్మన్గా జట్టులోకి తీసుకునే అవకాశాలనూ కొట్టిపారేయలేం. వీరిద్దరిలో కోహ్లీ ఎవరికి ఓటేస్తాడో చూడాలి.

చాహల్ X కుల్దీప్
బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, షమి లేనప్పటికీ తొలి వన్డేలో ఫాస్ట్బౌలర్లు మ్యాచ్ను మనవైపు తిప్పారు. భువనేశ్వర్ అనుభవంతో పాటు శార్దూల్ వైవిధ్యం, అరంగేట్ర పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మెరుపులు కలిసొచ్చాయి. అయితే ఆరంభ ఓవర్లలో పేసర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు కళ్లెం వేయడం అవసరం. వరుసగా మ్యాచ్లాడుతున్న శార్దూల్కు ఈ మ్యాచ్లో విశ్రాంతినిచ్చి నటరాజన్ లేదా సిరాజ్ను ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేం. జట్టు స్పిన్ విభాగమే కలవరపరుస్తోంది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్క వికెటైనా తీయకపోగా... 9 ఓవర్లలోనే ధారాళంగా 68 పరుగులివ్వడంతో కోహ్లి అతన్ని తప్పించి చహల్ను తుది జట్టులో ఆడించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

గెలిపించేదెవరు?
తొలి టెస్టు మినహా ప్రతి మ్యాచ్లో, ప్రతీ సిరీస్లో ఇంగ్లండ్కు సవాళ్లు, ఓటమిలే ఎదురవుతున్నాయి. పొట్టి సిరీస్లో మొదట హోరాహోరీగా తలపడిన ఇంగ్లండ్ తర్వాత భారత్తో ఢీకొనలేకపోయింది. ఇప్పుడు తొలి వన్డేలోనూ లక్ష్య ఛేదనలో టీమిండియాకు దీటుగా సాగిన ఇంగ్లండ్ అనంతరం చేతులెత్తేసింది. ఈ కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు వన్డే ప్రపంచకప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయంతో దూరమవడం జట్టును ఇబ్బందిపెట్టే అంశం. నెట్ ప్రాక్టీస్ కూడా చేయని కెప్టెన్ తదుపరి రెండు వన్డేలకు దూరమని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టోలు సూపర్ ఫామ్లో ఉన్నారు. వీరిద్దరి మెరుపులకు స్టోక్స్, బట్లర్ చెలరేగితే తప్పకుండా ఈ వన్డే ఫలితం మారొచ్చు. సిరీస్లో సజీవంగా నిలవొచ్చు. గాయాలతో దూరమైన మోర్గాన్, బిల్లింగ్స్ల స్థానంలో డేవిడ్ మలన్, అరంగేట్ర ఆటగాడు లివింగ్స్టోన్ బరిలోకి దిగే అవకాశముంది.

పిచ్, వాతావరణం
పిచ్ బ్యాటింగ్కు స్వర్గ ధామం. టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపే అవకాశం ఉంది. వర్షం ముప్పు లేదు. ఈ మ్యాచ్ మధ్యాహ్నాం 1.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జట్లు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, పంత్/సూర్యకుమార్, రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, చహల్, ప్రసిధ్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, బెయిర్ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్స్టోన్, మొయిన్, స్యామ్ కరన్, టామ్ కరన్, రషీద్, వుడ్/టోప్లీ.


Click it and Unblock the Notifications
