
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా యువ బ్యాట్స్మన్ శ్రేయస్ సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతని భుజానికి సర్జరీ అవసరం కావడంతో ఐపీఎల్ 2021 సీజన్కు కూడా దూరం కానున్నాడు. తాజాగా తన గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఓ సందేశం ఇచ్చాడు.
త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపాడు. 'మీరు చేసిన మెసేజ్లను చదివా. నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. త్వరలోనే దృఢంగా మళ్లీ తిరిగొస్తాను.'అని అయ్యర్ ట్వీట్ చేశాడు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో బెయిర్ స్టో కొట్టిన బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ డైవ్ చేయగా.. అతడి చేయి నేలను బలంగా తాకింది. శ్రేయస్ భుజం కొంతమేర డిస్లొకేట్ అయ్యింది. దీనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. సమస్య తీవ్రమైతే ఆ గాయానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది అని తెలిపారు.
ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన ఫస్ట్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా కిందపడ్డ అయ్యర్ ఎడమ భుజం డిస్లోకేట్ అయ్యింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఏనిమిదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో జానీ బెయిర్స్టో కొట్టిన షాట్ను అడ్డుకునే క్రమంలో డైవ్ చేసిన అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే టీమ్ ఫీజియోలు వచ్చి గాయాన్ని పరీక్షించగా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి సూచనల మేరకు మైదానం వీడాడు. అతన్ని స్కానింగ్ కోసం హాస్పిటల్కు తరలించగా.. ఎడమ భుజంలో పగులు వచ్చిందని సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఇక అయ్యర్ గైర్హాజరీతో తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్కు చాన్స్ దక్కనుంది.