
లండన్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. 21 ఏళ్ల గిల్ గాయపడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. శుభ్మన్ గిల్ గాయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ యువ ఓపెనర్ కాలి పిక్క కండరాల్లో గాయంతో బాధపడుతున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దాంతో అతను ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్కు అందుబాటులో ఉండకపోవచ్చని అంటున్నారు. గిల్కు ప్రత్యామ్నాయంగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్తో పాటు అభిమన్యు ఈశ్వరన్ పరిశీలనలో ఉన్నారు. ప్రస్తుతం ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో అతడు ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
'శుభ్మన్ గిల్కు అయిన గాయం తీవ్రమైనేదనని మా దృష్టికి వచ్చింది. దాంతో టెస్ట్ సిరీస్కు మరో నెల రోజుల గడువు ఉన్నప్పటికే అతను సిరీస్ మొత్తం దూరమయ్యే అవకాశాలున్నాయి'అని ఓ బీసీసీఐ అధికారి ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి తెలియజేశారు.
శుభ్మన్ గిల్ ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడాడు. 31.84 సగటుతో అతను 414 రన్స్ చేశాడు. అతని కెరీర్లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్టాండ్ బై ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు 64 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 43.57 సగటుతో 4401 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్లో ఈశ్వరన్ 13 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. టెంట్ బ్రిడ్జ్లో ఆగస్టు 4వ తేదీ నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానున్నది. ఈ ఐదు టెస్ట్ల సిరీస్తోనే డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్ ప్రారంభమవుతోంది.