
దెబ్బతీసిన భువీ..
330 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు తొలి ఓవర్లోనే గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెన్ జాసన్ రాయ్(14)ని భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో(1)ను వికెట్లు ముందు బోల్తాకొట్టించి టీమిండియాకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, డేవిడ్ మలాన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. వికెట్లు పడినా ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
అయితే భువీ బౌలింగ్లో బెన్ స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హార్దిక్ పాండ్యా నేలపాలు చేశాడు. అప్పుడు స్టోక్స్ 16 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ తప్పిదాన్ని నటరాజన్ సరిచేశాడు. పవర్ ప్లే ముగిసిన వెంటనే అతన్ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ తాత్కలిక కెప్టెన్ జోస్ బట్లర్(15)ను శార్దూల్ ఠాకూర్ వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. దాంతో ఇంగ్లండ్తో 95 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

మలాన్ హాఫ్ సెంచరీ..
ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన లివింగ్స్టన్, మలాన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బౌండరీలతో విరుచుకుపడ్డారు. శార్దూల్, ప్రసిధ్ లక్ష్యంగా ఆడారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్ విడదీసాడు. లివింగ్స్టన్(36)ను రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి మోయిన్ అలీ రాగా..శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఫోర్ కొట్టిన మలాన్ వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆ వెంటనే రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మొయిన్ అలీ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే అదే జోరులో భువీ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు సామ్ కరన్ మాత్రం తన జోరు తగ్గించలేదు. ఆదిల్ రషీద్తో కలిసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవర్కో బౌండరీ రాబడుతూ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు.

విరాట్ స్టన్నింగ్ క్యాచ్..
అయితే విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్కు ఆదిల్ రషీద్ వెనుదిరిగాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్ రెండో బంతిని రషీద్ డ్రైవ్ షాట్ ఆడగా.. విరాట్ సూపర్ మ్యాన్లా డైవ్ చేసి సింగిల్ హ్యాండ్తో బంతిని అందుకున్నాడు. అతని సూపర్ ఫీల్డింగ్ మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం అవాక్కయ్యారు. క్రీజులోకి మార్క్ వుడ్ రాగా.. సామ్ కరన్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సామ్ కరన్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హార్దిక్ పాండ్యా జారవిడిచాడు. దాంతో చెలరేగిన సామ్ కరన్ భారత జట్టును వణికించాడు. హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్లో రెండు సునాయస క్యాచ్లను భారత ఫీల్డర్లు వదిలేయగా.. 5 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. నటరాజన్ సూపర్ యార్కర్లతో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి విజయాన్నందించాడు.


Click it and Unblock the Notifications












