సుదీర్ఘ విరామం తర్వాత కుర్రాళ్లతో కూడిన టీమిండియా టీ20 ఫార్మాట్ మ్యాచ్లకు సిద్దమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా బుధవారం తొలి మ్యాచ్లో ఇంగ్లండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇరు జట్లు సన్నాహకాలను పూర్తి చేసుకొని తొలి టీ20కి సిద్దమయ్యాయి.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి కుర్రాళ్లతో కూడిన టీమిండియా నిర్భయంగా చెలరేగిపోతుంది. బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలను విధ్వంసకర బ్యాటింగ్తో మట్టికరిపించింది. అదే జోరులోను ఇంగ్లండ్ను ఓడించేందుకు రెడీ అవుతోంది.

14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మహహ్మద్ షమీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికైన అతనికి ఈ సిరీస్ లిట్మస్ టెస్ట్గా నిలవనుంది.
తొలి మ్యాచ్ జరిగే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనుంది. ఇక్కడ పిచ్లను నల్లటి నేలతో రెడీ చేస్తారు. ఈ పిచ్పై మంచి బౌన్స్ ఉంటుంది. బ్యాట్పైకి బంతులు సులువుగా వస్తాయి. అయితే మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలంగా మారుతోంది. వాతావరణం కూడా పిచ్ స్వభావంపై ప్రభావం చూపనుంది. రాత్రి వేలలో సీమ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. తేమ ప్రభావం కూడా ఉండనుంది.
ఇక్కడ ఇప్పటి వరకు 12 అంతర్జాతీయ టీ20లు జరగ్గా.. ఏడు సార్లు ఛేజింగ్ టీమ్ గెలవగా.. మరో 5 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. డ్యూ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మైదానంలో 63 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ క్రికెట్ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మైదానం మొత్తం కిక్కిరిసిపోనుంది.