టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడా వేదికగా 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంకా మొదలవ్వలేదు. కనీసం టాస్ కూడా పడలేదు. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారింది.
ముఖ్యంగా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు ఇంకా టాస్ వేయలేదు. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం వర్షం లేకున్నా.. మైదానాన్ని మబ్బులు కమ్మేసాయి. దాంతో ఈ మ్యాచ్ జరగడం సందేహంగా మారింది. ఈ ప్రపంచకప్లో భారత్ ఆడిన మూడు మ్యాచ్లు న్యూయార్క్లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరిగాయి.

ఈ వేదికలోని మందకొడి పిచ్పై భారత బ్యాటర్లు పరుగుల కోసం ఎంతో శ్రమించారు. అయితే లాడర్హిల్లోని బ్రోవార్డ్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో టీమిండియా ధనాధన్ బ్యాటింగ్ను కెనడా మ్యాచ్లో చూడొచ్చని అభిమానులు ఎన్నో ఆశలతో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ ఆశలకు వరుణుడు చెక్ పెడుతున్నాడు.
లాడర్హిల్లో శుక్రవారం జరగాల్సిన అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఒక వేళ కెనడాతో జరిగే మ్యాచ్ రద్దయినా భారత్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇప్పటికే ఆరు పాయింట్లతో గ్రూప్-ఏ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది.
లీగ్ దశను టాపర్గానే ముగిస్తుంది. మరోవైపు కెనడా మూడు పాయింట్లో మూడో స్థానానికి ఎగబాకి పాకిస్థాన్ను వెనక్కి నెట్టేస్తుంది. ప్రస్తుతం అమెరికా (5), పాకిస్థాన్ (2), కెనడా (2).. భారత్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, విరాట్ కోహ్లి, సంజు శాంసన్, రిషభ్ పంత్ , సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజా, చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్
కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్, పర్గాత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ, రవీంద్రపాల్ సింగ్, సాద్ బిన్ జఫార్ (కెప్టెన్), కలీమ్, హేలిగర్, జునైద్, గొర్డాన్, రయ్యాన్ పఠాన్, నిఖిల్ దత్తా, రాఘవ్ జోషి, దీల్ప్రీత్.