బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్లో పర్యాటక బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్లోనూ బంగ్లాదేశ్ను ఓడించాలనుకుంటుంది.
తద్వారా సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది. ఇప్పటికే కాన్పూర్ చేరిన టీమిండియా నెట్స్లో గంటల కొద్దీ శ్రమిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ తొలి మూడు రోజులు వర్షం అంతరాయం కలిగిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది.

గత మూడు రోజులుగా కాన్పూర్ నగరం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వర్షమే ఆ నగర ప్రజలకు కాస్త రిలీఫ్ ఇవ్వనుంది. వర్షం కురిస్తే రెండో టెస్ట్కు అంతరాయం కలగనుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే శుక్రవారం రోజు అయితే 93 శాతం వర్షం వచ్చే ఛాన్స్ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా ఉండనుంది.
శనివారం అయిన రెండో రోజు 83 శాతం వర్షం వచ్చే అవకాశం ఉంది. సాయంత్ర వేళలో భారీ ఉరుములతో వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడో రోజు అయిన ఆదివారం మాత్రం 59 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేయనున్నాయి. నాలుగు, ఐదో రోజు మాత్రం వర్ష సూచన లేదు.
తొలి మూడు రోజులు వర్షం కురిసినా.. కాస్త ఆట సాధ్యమైతే చివరి రెండు రోజుల ఆటతో ఫలితం తేలనుంది. అయితే భారీ వర్షం కురిస్తే మైదానం చిత్తడిగా మారి ఆటకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఈ వర్ష సూచన భారత అభిమానులను కలవరపెడుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినా.. డ్రాగా ముగిసినా సిరీస్ భారత్ కైవసం అవుతుంది. కానీ డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ 2025 పాయింట్స్ టేబుల్లో భారత అగ్రస్థానం మరింత పదిలం కాదు. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే తర్వాత ఆడే 8 మ్యాచ్ల్లో తప్పక 6 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
నిరసన సెగ..
హిందూ మహా సభ నిరసన సెగతో కాన్పూర్ మైదానం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. హిందూమహా సభ ఉపాధ్యక్షుడు జయవీర్ భరద్వాజ్ నిరసనలు గురించి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువులపై, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా గ్వాలియర్లో నిరసనలు చేపడతామని చెప్పారు.
గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. అయితే కాన్పూర్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హోటల్ నుంచి మైదానం వరకు, ఇరు జట్ల ఆటగాళ్లకు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని కాన్పూర్ పోలీస్ కమీషనర్ హరీష్ చందర్ చెప్పారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్క భద్రత బాధ్యతలు చూస్తాయని తెలిపారు. నిరసనలు తెలిపేందుకు ప్రయత్నిస్తే చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్టేడియంలో రిపేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్టేడియంలోని సీ బాల్కానీ సీట్లను పూర్తిగా అమ్మలేదని తెలుస్తోంది. కొన్ని టికెట్స్ మాత్రమే అమ్మినట్లు స్టేడియం వర్గాలు పేర్కొన్నాయి.