వర్ష గండ లేదు..
ఆ స్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటనలో వర్షంతో విసిగిపోయిన అభిమానులకు గుడ్ న్యూస్. బంగ్లాదేశ్తో జరిగే తొలి వన్డేకు ఎలాంటి వర్షం ముప్పులేదు. భారత్ మాదిరి బంగ్లాదేశ్లో కూడా చలికాలం కావడంతో వర్షం వచ్చే సూచనల్లేవ్. మ్యాచ్ సజావుగా జరగనుంది. న్యూజిలాండ్ పర్యటనలో వర్షం కారణంగా భారత్ రెండే రెండు పూర్తి స్థాయి మ్యాచ్లు ఆడింది. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ బంగ్లాదేశ్లో ఆ పరిస్థితి లేకపోవడం ఊరటనిచ్చే అంశం.
పిచ్ ఎలా ఉంది?
మిర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో పరుగులకు లోటుండదు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే సులువుగా 300 పైచిలుకు స్కోరు నమోదు చేయొచ్చు. పిచ్ నుంచి స్పిన్నర్లకు మంచి సహకారం అందుతుంది. పేసర్లు కష్టపడాల్సి ఉంటుంది. గతేడాది మేలో చివరి సారిగా ఇక్కడ వన్డే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
కుల్దీప్ సేన్ అరంగేట్రం చేసేనా..?
టీ20లకు దూరం పెట్టిన ధావన్ను వన్డేల్లో మాత్రం ఆడిస్తున్నారు సెలక్టర్లు. వన్డే ప్రపంచకప్కు అతణ్ని కీలక ఆటగాడిగా టీమ్మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో రోహిత్కు తోడుగా ధావన్నే ఓపెనర్గా పంపే అవకాశముంది. మరో ఓపెనర్ రాహుల్ మిడిలార్డర్లో ఆడే అవకాశముంది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వరుసగా 3, 4 స్థానాల్లో ఆడొచ్చు. ఈ సీనియర్ల మధ్య యువ ఆటగాళ్లు శ్రేయస్, పంత్ ఎలా తమ ప్రత్యేకతను చాటుకుంటారో చూడాలి.
బుమ్రా, మహమ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో పేస్ విభాగంలో అనుభవలేమి సమస్యగా మారొచ్చు. షమీ గాయంతో దూరమవ్వగా.. ఉమ్రాన్ మాలిక్ను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే తొలి వన్డేకు అతను అందుబాటులో లేడు. దాంతో యువ పేసర్ కుల్దీప్ సేన్కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. మరి శార్దూల్, సిరాజ్, దీపక్ చాహర్ సవాలును ఎలా కాచుకుంటారో? న్యూజిలాండ్లో సత్తా చాటిన సుందర్కు తోడు అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది.
తుది జట్లు (అంచనా)..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్: లిటన్ దాస్ (కెప్టెన్), అనాముల్ హక్, షకిబ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, అఫిఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మూద్, ముస్తాఫిజుర్, ఎబాదత్ హొస్సేన్.