సిడ్నీ: కరోనా బ్రేక్ అనంతరం ఆడిన తమ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియాకు చుక్కెదురైంది. ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కోహ్లీసేన 66 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పోటీపడి దారళంగా పరుగులిచ్చుకున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అయితే ఏకంగా 89 పరుగులు సమర్పించుకొని చెత్తరికార్డును మూటగట్టుకున్నాడు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఓ స్పిన్నర్ ఈ స్థాయిలో పరుగులివ్వడం ఇదే తొలిసారి. గతేడాది వన్డే వరల్డ్ కప్లో ఎడ్జ్బస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో చాహల్ 88 రన్స్ ఇచ్చుకున్నాడు.
తాజా సిడ్నీ వన్డేలో వాటికి ఒక్క పరుగు ఎక్కువగా ఇచ్చుకున్న చాహల్ తన పేరిట ఉన్న చెత్త రికార్డును తిరగరాసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత స్పిన్నర్ల జాబితాలో పియూష్ చావ్లా మూడో స్థానంలో ఉన్నాడు. 2008లో మిర్పూర్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో చావ్లా 85 రన్స్ ఇచ్చుకున్నాడు.
సిడ్నీ వన్డేలో చాహల్.. మార్కస్ స్టోయినిస్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. కానీ మ్యాక్స్వెల్ ముందు మాత్రం తేలిపోయాడు. చాహల్ వేసిన 43 ఓవర్లో మ్యాక్సీ రెండు సిక్సులు ఓ ఫోర్ బాదాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా వికెట్లేమీ తీయకుండా పది ఓవర్లలో 63 రన్స్ ఇచ్చుకున్నాడు. నవదీప్ సైనీ 89 పరుగులు ఇవ్వగా.. బుమ్రా 73 రన్స్ ఇచ్చుకున్నాడు. షమీ 59 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా మాత్రం 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్లతో 114), స్టీవ్ స్మిత్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (76 బంతుల్లో 6ఫోర్లతో 69), గ్లెన్ మాక్స్వెల్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 45) మెరుపు ఇన్నింగ్స్తో రాణించారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా( 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 90), శిఖర్ ధావన్(86 బంతుల్లో 10 ఫోర్లతో 74) రాణించినా ఫలితం లేకపోయింది.
India vs Australia: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయి!