
సిడ్నీ: టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్పై ఏకాగ్రత ఉంచడానికి ఆస్ట్రేలియా యువ క్రికెటర్ విల్ పకోస్కీ సోషల్ మీడియాకు దూరమయ్యాడు. 22 ఏళ్ల యువ క్రికెటర్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వరుసగా రెండు డబుల్ సెంచరీలతో సత్తాచాటి అందరి దృష్టిని ఆకర్షించిన పకోస్కీ.. భారత్తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్కు ఎంపికయ్యాడు. అంతేగాక బర్న్స్ స్థానంలో పకోస్కీ తుదిజట్టులో చోటు ఖాయమని, వార్నర్తో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పకోస్కీ సోషల్ మీడియాకు దూరమై ఆటపై దృష్టిసారించాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్పష్టం చేశాడు.
'నిజాయతీగా చెప్పాలంటే మీడియా ద్వారా కాస్త అంచనాలు పెరుగుతున్నాయి. అయితే వీటిని పక్కనపెట్టి నా ఆటపై దృష్టిసారించాలి. బ్యాటింగ్లో గొప్పగా రాణించాలి. అందుకే సామాజిక మాధ్యమాలకు దూరమవుతున్నా. దీంతో ట్విటర్, ఇతర మాధ్యమాల్లో ట్యాగ్ చేయలేరు. దాంతో నేను ఆటపైనే దృష్టిపెట్టగలను' అని పకోస్కీ తెలిపాడు.
బర్న్స్-వార్నర్ ఓపెనింగ్ జోడీ గురించి ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు.'పకోస్కీ ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడు. కానీ జో బర్న్స్- డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ జోడీని ఇష్టపడుతున్నాం. ప్రస్తుతం ఆ జోడీలో ఎలాంటి మార్పులు లేవు'అని లాంగర్ స్పష్టం చేశాడు. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కరోనా అనంతరం జరుగుతున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్ కావడంతో భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.