
మొహాలీ: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సన్నదమవుతున్నాడు. మొహాలీ వేదికగా మంగళవారం జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు మొహాలీ చేరుకొని ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. కింగ్ కోహ్లీ సైతం.. ఈ సిరీస్ కోసం ముమ్మురంగా సాధన చేస్తున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పేసర్లు సంధించే బౌన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడమే లక్ష్యంగా పుల్ షాట్స్ ప్రాక్టీస్ చేశాడు. సోమవారం గంటల తరబడి నెట్స్లో భారత పేసర్ల బౌలింగ్లో పుల్ షాట్స్ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇక గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆ పర్యటన అనంతరం నెల రోజుల పాటు విరామం తీసుకున్న కోహ్లీ ఆసియాకప్ 2022తో రీఎంట్రీ ఇచ్చాడు. పాకిస్థాన్తో 35 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత హాంగ్ కాంగ్పై హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సూపర్ 4లో పాకిస్థాన్పై మరో హాఫ్ సెంచరీ బాదిన విరాట్.. అఫ్గాన్పై అజేయ శతకం బాది మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్తో తాను మళ్లీ ఫామ్లోకి వచ్చాననే విషయాన్ని ప్రత్యర్థి జట్లకు తెలియజేశాడు.
ప్రపంచకప్ ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో.. బలహీనతలను అధిగమించడంపై కోహ్లీ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈ సిరీస్లో ఫస్ట్ టీ20 మ్యాచ్ మొహాలిలో జరగనుండగా.. ఆ తర్వాత రెండు టీ20లకి నాగ్పూర్ (శుక్రవారం), హైదరాబాద్ (ఆదివారం) ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టీ20 ప్రపంచకప్నకు ముందు బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ను సెట్ను చేసుకోవడానికి భారత్కు మంచి తరుణం. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చాడు. అలాగే యువ బౌలర్ హర్షల్ పటేల్ కూడా జట్టుతో చేరాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్ జట్టులోనూ ఉన్నారు. దీంతో చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగుతున్న బుమ్రా, పటేల్ ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. ప్రపంచకప్ నాటికి బౌలింగ్ లయను అందుకోవాలని భారత్ ఆశిస్తోంది.