
సిడ్నీ: మిడిల్ ఓవర్లలో సరైన భాగస్వామ్యం నెలకొల్పకపోవడంతోనే ఆఖరి టీ20లో ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీసేన 12 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఆ జోరును ఆఖరి మ్యాచ్లో కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్లో విఫలమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు.
'టీ20 క్రికెట్లో మనమే అవకాశాలను తీసుకోవాలి. హార్దిక్ ఔటైనా మ్యాచ్ ముగిస్తాననుకున్నా. కానీ లక్ష్యం ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. మిడిల్ ఓవర్లలో మా నెమ్మదైన బ్యాటింగ్ కొంచెం నష్టం చేసింది. ఈ ఓవర్లలో మాకు 25-30 పరుగుల భాగస్వామ్యం లభిస్తే ఫలితం మరోలా ఉండేది. చివర్లో 80 పరుగులు కాకుండా 60 పరుగులే చేదించాల్సి ఉంటే హార్దిక్ ఆ పనిని పూర్తి చేసేవాడు. ఈ సిరీస్ గెలుపుతో ఈ ఏడాది టీ20 ఫార్మాట్ను మేం ఘనంగా ముగించాం. నిజాయితీగా చెబుతున్నా మా విజయంలో ప్రేక్షకుల పాత్ర కూడా కీలకం. ఈ విపత్కర పరిస్థితుల్లో మళ్లీ ప్రేక్షకుల సమూహం మధ్య ఆడటం చాలా గొప్పగా ఉంది. ఈ సిరీస్లో మా అభిమానులు మమ్మల్ని పలుమార్లు ముందుకు లాగారు. ఆస్ట్రేలియా కూడా చాలా మద్దతుగా నిలిచింది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 80), గ్లేన్ మ్యాక్స్వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సుంధర్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, ఠాకుర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ (3/23) భారత పతనాన్ని శాసించగా.. మ్యాక్స్వెల్, అబాట్, టై, జంపా తలో వికెట్ తీశారు.