
సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి టచ్లోకి వచ్చిన విరాట్ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 89).. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 22 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్గా నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు ఈ జాబితాలో టాప్లో ఉన్న సచిన్ టెండూల్కర్ను విరాట్ వెనక్కు నెట్టాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ కేవలం 462 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకోగా.. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 493 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. తాజాగా సచిన్ టెండూల్కర్ని విరాట్ కోహ్లీ రెండో స్థానానికి నెట్టగా.. బ్రియాన్ లారా (511 ఇన్నింగ్స్లు), రిక్కీ పాంటింగ్ (514) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
వన్డేల్లో 241 ఇన్నింగ్స్ల్లో 11,977 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 145 టెస్టు ఇన్నింగ్స్ల్లో 7,240 రన్స్ చేశాడు. అలానే 76 టీ20 ఇన్నింగ్స్ల్లో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా.. ఇందులో 70 సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో 7 ఫోర్లు కొట్టిన విరాట్.. మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అత్యధిక ఫోర్ల వన్డే రికార్డును బ్రేక్ చేసాడు. ఈ జాబితాలో భారత్ నుంచి ధోనీ 499 ఫోర్లతో నాలుగో స్థానంలో ఉండగా.. విరాట్ అధిగమించాడు. 500 ఫోర్లతో ఆస్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో పాంటింగ్ 794 ఫోర్లతో టాప్లో ఉండగా.. ఫ్లెమింగ్(670), గ్రేమ్ స్మిత్(630) కోహ్లీ కన్నా ముందున్నారు.
రెండో వన్డేలో విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో కోహ్లీసేన 51 పరుగులతో ఓటమిపాలై.. సిరీస్ను 0-2తో ఓ మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు) మరోసారి మెరుపు సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), ఆరోన్ ఫించ్ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
చివర్లో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు) , గ్లెన్ మ్యాక్స్వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) పరుగుల విధ్వంసం సృష్టించారు. అనంతరం భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య నామమాత్రపు మూడో వన్డే బుధవారం జరగనుంది.