
చెన్నై: 'గ్రహచారం చాలకపోతే తాడే పామై కరుస్తుంది'అంటారు పెద్దలు. ఈ సామెత టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు సరిగ్గా సరిపోతుంది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో పుజారా(143 బంతుల్లో 11 ఫోర్లతో 73) హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 19 పరుగులకే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన పుజారా.. మరోవైపు వరుసగా వికెట్లు పడుతున్న నిలకడగా ఆడాడు.
73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును యువ వికెట్ రిషభ్ పంత్తో కలిసి ఐదో వికెట్కు 119 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించాడు. ఈ క్రమంలో లీచ్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ తరలించిన ఫుజారా.. 106 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో కెరీర్లో 29వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ముఖ్యంగా తన శైలికి భిన్నంగా బౌండరీలు రాబడుతూ మంచి స్ట్రైక్రేట్ మెయింటేన్ చేశాడు.
క్రీజులో ఎలాంటి తడబాటు లేకుండా ఇంగ్లండ్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్నాడు. ఓ దశలో అతని జోరు చూస్తే సెంచరీ ఖాయామనిపించింది. కానీ డామ్ వేసిన 51వ ఓవర్ నాలుగో బంతికి పుజారా అనూహ్యంగా ఔటయ్యాడు. ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా పుజారా భారీ షాట్కు ప్రయత్నించగా.. షార్ట్ లెగ్లో ఉన్న పోప్ భుజానికి తగిలి గాల్లోకి లేచి నేరుగా రోరీ బర్న్స్ చేతుల్లోకి వెళ్లింది. ఏ మాత్రం ఊహించని ఈ ఘటనకు పుజారా నిరాశగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత రిషభ్ పంత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. పుజారా ఔటైనా ధాటిగా ఆడిన పంత్.. సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు. డామ్ బెస్ బౌలింగ్లోనే క్రీజు బయటకు వచ్చి భారీ షాట్ ఆడబోయిన పంత్.. లీచ్కు చిక్కాడు. దాంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్(1 బ్యాటింగ్), సుందర్(15 బ్యాటింగ్) ఉన్నారు.