
బ్రిస్బేన్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్తో టీమిండియా యువ ఆటగాళ్లు టీ నటరాజన్, వాషింగ్టన్ సుంధర్ అరంగేట్రం చేశారు. మ్యాచ్కు ముందు అశ్విన్ చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్.. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ చేతుల మీదుగా నటరాజన్ టెస్ట్ క్యాప్లు అందుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత జట్టులో చాలా మార్పులు జరిగాయి. గాయాలతో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా దూరమవ్వగా.. వారి స్థానాల్లో సుంధర్, నట్టూ తుది జట్టులోకి వచ్చారు. జడేజా స్థానంలో శార్దుల్ ఠాకూర్, విహారీ ప్లేస్లో మయాంక్ అగర్వాల్ అవకాశం దక్కించుకున్నారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే గట్టి షాకిచ్చాడు. ఆ ఓవర్ చివరి బంతికి స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(1)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఫస్ట్ స్లిప్కు కాస్త ముందు పడుతున్న బంతిని రెండో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ను అందుకున్నాడు. ఇక తొమ్మిదో ఓవర్లో బౌలింగ్కి వచ్చిన శార్దూల్ ఠాకూర్ తొలి బంతికే సంప్రదాయక ఫార్మాట్లో తొలి వికెట్ సాధించాడు. మార్కస్ హారిస్ (5) వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఆసీస్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(29 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(16) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గత మ్యాచ్ ఫామ్ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 22 ఓవర్లలో ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, టి. నటరాజన్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పెయిన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జాష్ హేజిల్వుడ్