జింఖానాలో ఆందోళన..
హెచ్సీఏ వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. మ్యాచ్ టికెట్ల కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన అభిమానులు.. బుధవారం ఉదయం నుంచి జింఖానా మైదానంలో పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడ్డారు. టికెట్ల జారీ విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అక్కడే నిరీక్షిస్తున్నారు. బ్లాక్లో టికెట్ల విక్రయాలను హెచ్సీఏ ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపించారు. టికెట్ల కోసం గత మూడు రోజులుగా జింఖానా మైదానానికి వస్తున్నా హెచ్సీఏ నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ..
ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ నగదును రిఫండ్ చేస్తున్నారని మరికొందరు వాపోయారు. 55వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. భారీగా అభిమానులు అక్కడికి చేరుకోవడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రికెట్ అభిమానుల ఆందోళన, బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలపై హెచ్సీఏ అధికారులు స్పందించాల్సి ఉంది. బయట ఇంత జరుగుతున్నా.. హెచ్సీఏ అధికారులు మాత్రం స్పందించడం లేదు.
16 ఎకరాల్లో 55 వేల సీట్లు..
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సుమారు 16 ఎకరాల్లో 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. స్టేడియం సామర్థ్యం 55 వేలు సీట్ల వరకు ఉంటుంది. ఇందులో 39 వేల టికెట్లు మాత్రమే విక్రయిస్తుంటారు. వీటిలో దాదాపు 10 వేల టికెట్ల వరకు కాంప్లిమెంటరీగా ఇవ్వగా మిగిలిన 29 వేల టికెట్లను విక్రయానికి ఉంచుతున్నారు. టికెట్ల ధరలు రూ.850 నుంచి 15000 వరకు ఉన్నాయి. కార్పోరేట్ బాక్స్లు 40 వరకు ఉండగా.. ఒక్కో బాక్స్లో 20 వరకు సీట్ల సర్దుబాటు ఉంటుంది. అయితే మూడేళ్ల తర్వాత నగరంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో సినీ,రాజకీయ, పోలీస్ ప్రముఖుల నుంచి టికెట్ల కోసం హెచ్సీఏ అధికారులపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
