
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు ముంగిట భారత క్రికెటర్లకు టీమిండియా మేనేజ్మెంట్ గట్టి హెచ్చరికల్ని జారీ చేసింది. సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. మెల్బోర్న్ నుంచి సోమవారం సిడ్నీకి భారత్, ఆస్ట్రేలియా జట్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ట్రైనింగ్కి మినహా ఎట్టి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు హోటల్ బయటకు వెళ్లకూడదని, బయో బుబుల్ దాటొద్దని టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల మెల్బోర్న్లో ఐదుగురు భారత క్రికెటర్లు.. హోటల్ బయటకు వెళ్లి ఓ రెస్టారెంట్లో ఫుడ్ తినడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
నూతన సంవత్సరం సందర్భంగా భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, రిషభ్ పంత్, నవదీప్ సైనీ, పృథ్వీ షాలు ఓ రెస్టారెంట్కు వెళ్లి ఫుడ్ తిన్నారు. అయితే.. భారత క్రికెటర్లకు తెలియకుండా వారు ఫుడ్ తింటున్న వీడియోను రికార్డ్ చేసిన ఓ భారత అభిమాని.. బిల్ కూడా పేచేసి వారిని ఆశ్చర్యపరిచాడు. అయితే భారత క్రికెటర్లు బిల్ డబ్బులు వెనక్కి తీసుకోవాలని సదరు అభిమానిని కోరగా.. అతను నిరాకరిస్తూ తనతో కలిసి ఫొటో దిగాలని కోరాడు. కానీ అందుకు నిరాకరించిన భారత క్రికెటర్లు.. హగ్ మాత్రం ఇచ్చినట్లు ఆ అభిమాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాకుండా.. క్రికెటర్లు ఫుడ్ తింటున్న వీడియో, బిల్ని కూడా పోస్ట్ చేసేయడంతో వివాదం రాజుకుంది. దాంతో అలాంటిదేం జరగలేదని యూటర్న్ తీసుకుంటూ మరో ట్వీట్లో స్పష్టం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
భారత క్రికెటర్లు బయో-సెక్యూర్ బబుల్ రూల్ని బ్రేక్ చేసి రెస్టారెంట్కు వెళ్లడం.. అక్కడ అభిమానికి హగ్ ఇవ్వడాన్ని సీరియస్గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్లో ఉంచింది. ఆ తర్వాత వారితో పాటు టీమ్ మొత్తానికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ రావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. దాంతో మరోసారి అదే తప్పిదం పునరావృతం కాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకోవడంలో భాగంగా టీమిండియా మేనేజ్మెంట్ తాజాగా ఆటగాళ్లని మందలించినట్లు తెలుస్తోంది.