
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్ మంగళవారంతో ముగిసింది. కరోనా నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఈ క్యాషరిచ్ లీగ్ సూపర్ సక్సెస్ అయింది. సుమారు రెండు నెలల పాటు అభిమానులను అలరించింది. భారత్లో జరగకున్నా.. ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్రేట్ల దాగుడుమూతలతో టీవీలకు అతుక్కు పోయేలా చేసింది.
ఈ ధనా ధన్ లీగ్లో ప్రత్యర్థులుగా తలపడిన ఆటగాళ్లు మళ్లీ ఒకటి కానున్నారు. కరోనా అనంతరం టీమిండియా ఆడనున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్కు అంతా సమయాత్తం అవుతున్నారు. ఇప్పటికే యూఏఈలో ఏర్పాటు చేసిన బయో బబుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నవంబర్ 27 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే ఈ టూర్కు సంబంధించిన జట్లను బీసీసీఐ ప్రకటించింది.
నవంబర్ 12న విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జంబో జట్టు దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఆటగాళ్లందరూ సిడ్నీ నగరంలో క్వారంటైన్లో ఉండనున్నారు. అక్కడే వన్డే, టీ20 సిరీస్ల కోసం ఆటగాళ్లు సాధన చేయనున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు భారత క్రికెటర్లు ఇప్పటికే టీమ్కు సంబంధించిన బయో సెక్యూర్ బబుల్లోకి అడుగుపెట్టారు. ముంబై, ఢిల్లీ ఫైనల్ మ్యాచ్ అనంతరం చివరి బ్యాచ్ ఆటగాళ్లు కూడా జట్టుతో చేరారు. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ముంబై జట్టుతో భారత్కు రానున్నాడు. టెస్ట్లకు మాత్రమే ఎంపికైన హిట్ మ్యాన్ ఎన్సీఏలో చికిత్స తీసుకోనున్నాడు. ఆ తర్వాత సపరేట్గా ఆసీస్కు వెళ్లనున్నాడు.