
న్యూఢిల్లీ: తొలి టెస్ట్లో దారుణ ఓటమి మూటగట్టుకున్న భారత జట్టు.. స్టార్ పేసర్ మహ్మద్ షమీ సేవలను కూడా కోల్పోనుంది. పింక్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుండగా తీవ్రంగా గాయపడిన పేసర్ మహ్మద్ షమీ.. సిరీస్లో మిగిలిన మూడు టెస్ట్లకు దూరం కానున్న విషయం తెలిసిందే. షమీ చేతికి ఫ్రాక్చర్ అయినట్టు అతనికి చేసిన స్కానింగ్లో తేలింది. దాంతో షమీ.. ఆసీస్ టూర్ ముగిసినట్టేనని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కానీ అదే జరిగితే.. మహ్మద్ షమీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ ఊపందుకుంది. షమీ స్థానంలో యార్కర్లకింగ్, యువ సంచలనం టీ నటరాజన్ను తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20ల్లో రాణించిన నటరాజన్.. టెస్ట్ల్లోనూ అదరగొట్టగలడని టీమ్మేనేజ్ భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే వన్డేల తర్వాతే భారత్కు రావాల్సిన నటరాజన్ను బీసీసీఐ ముందు జాగ్రత్తగా ఆస్ట్రేలియాలోనే ఉంచింది. ఏ ఆటగాడైన గాయపడితే ఆ స్థానంలో భర్తీ చేసుందుకు, అలాగే నెట్ బౌలర్గా వాడుకునేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
కానీ తాజాగా షమీ గాయపడటంతో అతని స్థానంలో బరిలోకి దిగేందుకు నటరాజన్కు మార్గం సుగుమమైంది. కానీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన నవ్దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్లను ధాటి నటరాజన్కు అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికర ప్రశ్న. కానీ ఇతర ప్లేయర్లకు గాయం కావడం వల్లే నటరాజన్ వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఆ లెక్కనే మరోసారి టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసే అవకాశం లేకపోలేదు.
ఇక కమిన్స్ వేసిన షార్ట్ బాల్.. షమీ కుడి చేతి మణికట్టుకి బలంగా తాకింది. దాంతో బ్యాట్ కూడా ఎత్తలేకపోయిన పేసర్.. మరో దారిలేక రిటైర్డ్ నాటౌట్గా మైదానాన్ని వీడాడు. టీమ్ మెడికల్ సిబ్బంది వెంటనే షమీని హాస్పిటల్కు తరలించి స్కాన్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. 'ఏం జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. షమీకి ఫ్రాక్చర్ అయింది. దాని వల్లే అతను బ్యాట్ను సరిగ్గా పట్టుకోలేకపోయాడు'అని జట్టు వర్గాలు వెల్లడించాయి. షమీ దూరమైతే నటరాజన్ ఏమో కానీ మహ్మద్ సిరాజ్కు మాత్రం మార్గం సుగుమమైంది.