
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి, పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం సూర్యకుమార్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగన రెండో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో భారత ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. మార్చి 1న ఇండోర్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ భారత ఆటగాళ్లకు 6 రోజులు విశ్రాంతినిచ్చింది. దాంతో ఆటగాళ్లంతా తమ ఫ్యామిలీస్తో వేకేషన్కు వెళ్లారు. ఈ సిరీస్తోనే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్.. తన ఖాళీ సమయాన్ని తిరుపతిలో గడిపాడు. సూర్య పేరెంట్స్తో పాటు అతని సతీమణి తల్లిదండ్రులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించిన టీమిండియా.. రెండో టెస్ట్లో 6 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు టెస్ట్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు టెస్ట్లు డ్రా చేసుకున్నా.. ఒక్క మ్యాచ్ గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖారారు అవుతోంది.
ఇతర టీమిండియా ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఢిల్లీలోని తన నివాసంలో ఫ్యామిలీతో గడుపుతుండగా.. రోహిత్ శర్మ ముంబైకి వెళ్లినట్లు సమాచారం. రెండో టెస్ట్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు ఢిల్లీలోని ప్రధాని సంగ్రాలయ మ్యూజియంను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఫిబ్రవరి 28న ఇండోర్లో భారత ఆటగాళ్లంతా సమావేశం కానున్నారు.