సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడంతో.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ఇంకా అన్వేషణ సాగుతూనే ఉంది. మహీ వారసుడిగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు చాలా అవకాశాలిచ్చిన అతను విఫలమయ్యాడు. నిలకడలేమి ఆటతో జట్టులో చోటునే కోల్పోయాడు. ఇక కేఎల్ రాహుల్తో చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో పరిమిత ఓవర్లలో ప్రస్తుతానికి అతనే కొనసాగుతున్నాడు. అయినప్పటికీ కీపింగ్ ప్లేస్ కోసం ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అప్కమింగ్ ఆస్ట్రేలియా సిరీస్లో ఎవరు అవకాశం దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీ20ల్లో దూకుడుగా ఆడే సంజూ శాంసన్ కూడా రేసులో ఉన్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న సాహా టెస్ట్ల్లో కీపింగ్ చేయడం ఖాయం.
అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రస్తుత భారత క్రికెట్లో ఇద్దరు బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లెవరో వెల్లడించాడు. రిషభ్ పంత్, వృద్దిమాన్ సాహా ఇద్దరూ అత్యుత్తమ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2020లో రిషభ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అతన్ని దాదా వెనకేసుకొచ్చాడు. 'ఐపీఎల్లో పంత్ తన సహజసిద్ధమైన ఆటతీరు కనబర్చలేకపోయినా.. అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. కచ్చితంగా జట్టులోకి వస్తాడనే నమ్మకం ఉంది. పంత్ యువ ఆటగాడు. అతనికి సలహాలు, సూచనలు అవసం'అని దాదా అభిప్రాయపడ్డాడు..
టెస్టు సిరీస్లో పంత్కు ఆడే అవకాశం కల్పిస్తారా? అనే ప్రశ్నకు గంగూలీ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. 'సాహా మెరుగైన వికెట్ కీపర్. పైగా బ్యాటింగ్లోనూ ఫామ్లో ఉన్నాడు. ఎవరు మంచి ఫామ్లో ఉంటే వారు ఆడుతారు'అని తెలిపిన దాదా సాహాకే అవకాశం ఉందని పరోక్షంగా తెలిపాడు. పంత్, సాహా కేవలం టెస్ట్ సిరీస్లకు ఎంపికవ్వగా.. కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్కు సెలెక్టయ్యారు. రాహుల్ టెస్ట్ల్లో చోటు దక్కించుకున్నా.. బ్యాట్స్మన్గానే బరిలోకి దిగనున్నాడు. నవంబర్ 27న ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు , నాలుగు టెస్ట్లు జరగనున్నాయి.