
మెల్బోర్న్: తమ టెస్ట్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో లెక్క సమం చేసేందుకు రెడీ అవుతోంది. శనివారం మొదలయ్యే బాక్సింగ్ డే టెస్ట్ కోసం నెట్స్లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో చెత్త బ్యాటింగ్తో 36 పరుగులకే ఇన్నింగ్స్ను ముగించి పరువుతీసుకున్న టీమిండియా.. దెబ్బతిన్న పులిలా ఆసీస్ను దెబ్బతీసేందుకు సమయాత్తం అవుతోంది.
హెడ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా బ్యాట్స్మెన్ బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. వీడియో అనలిస్టులతో చర్చిస్తూ తమ టెక్నిక్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేశారు. బాక్సిండే టెస్ట్కు భారీ మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా.. ఆ దిశగానే సాధన చేస్తోంది. కంకషన్ గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నెట్స్లో ముమ్మరంగా బ్యాటింగ్ సాధన చేశాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఇతర బ్యాట్స్మెన్ చెమటోడ్చారు. రవిశాస్త్రి దగ్గరుండి మరి వీరి ప్రాక్టీస్ను పర్యవేక్షించాడు. పంత్కు పలు సూచనలు చేస్తున్న వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గాయంతో దూరమైన షమీ స్థానం కోసం పోటీ పడుతున్న మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీలు కూడా నెట్స్లో రహానేకు బౌలింగ్ చేశారు.
పెటర్నిటీ లీవ్లో ఉన్న విరాట్ కోహ్లీని భర్తీ చేసే మొనగాళ్లు జట్టులో లేకపోయినా.. ఆ స్థాయిలో బ్యాలెన్స్ చేస్తే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు. రిస్ట్ ఇంజ్యురీతో టీమ్కు దూరమైన షమీని మరిపించేలా మరో యంగ్ పేసర్ బయటకు రావాలి. అతను ఎవరు..? భారీ ఓపెనింగ్ ఇచ్చే ఇద్దరు ప్లేయర్లు ఇప్పుడు భారత్కు అత్యవసరం. వాళ్లిద్దరు ఎవరు..? మిడిలార్డర్లో పుజారా, రహానేకు అండగా నిలిచే మిగతా వాళ్లు ఎవరు..? ఇవన్నీ కుదిరినా టీమ్ స్ట్రాటజీ ఏంటీ? ఐదుగురు బౌలర్లతో దిగుతారా? బ్యాటింగ్ డెప్త్ కోసం స్పిన్ ఆల్రౌండర్కు చాన్స్ ఇస్తారా? వీటన్నింటికీ సమాధానాలు వెతకాల్సిందే. నిక్కచ్చిగా చెప్పాలంటే.. ఇప్పుడు టీమిండియా గాయపడిన పులి. దాని నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉండాలే తప్ప.. గతాన్ని గుర్తు చేసేలా ఉండకూడదు. మరేం చేస్తుందో చూడాలి!