రోహిత్ స్థానంలో అయ్యర్
రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్కు వెళ్తారా లేదా అన్న అంశంపై ప్రస్తుతం సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో భారత యువ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయ్యర్ను రిజర్వ్ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే భారత్ తరఫున వన్డే, టీ20 మ్యాచ్లు ఆడిన అయ్యర్.. టెస్టుల్లో కూడా అరంగేట్రం చేసేందుకు మార్గం సుగమమవుతుంది. గతకొంత కాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అయ్యర్ రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డేల్లో నాలుగో స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు.
టీమిండియాకు కోలుకోలేని దెబ్బ
గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఓపెనర్గా వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైతే టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే మొదటి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్కు తిరిగి రానున్న విషయం తెలిసిందే. దీంతో హిట్మ్యాన్ కూడా అందుబాటులో లేకుంటే బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో భారత పేస్ బృందంకు నాయకత్వం వహిస్తున్న ఇషాంత్ దూరమవడం కూడా కూడా జట్టుపై ప్రభావం చూపనుంది.
ఓపెనర్గా గిల్
ఇక వన్డే, టీ20ల సిరీస్కు ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తిగా దూరమవ్వడంతో శిఖర్ ధావన్తో ఇన్నింగ్స్ను ఎవరు ఆరంభిస్తారని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కేఎల్ రాహుల్ ఓపెనర్గా సత్తాచాటుతున్నప్పటికీ.. అతడు మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు వస్తాడని వార్తలు వస్తున్నాయి. దీంతో మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరిలో ఒకరు ఓపెనర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గిల్కు సూచనలు ఇస్తున్న చిత్రాన్ని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ట్విటర్లో షేర్ చేయడంతో.. ధావన్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని వార్తలు వెలుబడుతున్నాయి.
వన్డేల్లో నాలుగో స్థానం పక్కా
వన్డేల్లో శ్రేయస్ అయ్యర్కు స్థానం పక్కాగా మారిన విషయం తెలిసిందే. తొలి వన్డేకు తుది జట్టులో 9 ఆటగాళ్ల స్థానాలు దాదాపు ఖరారైనట్లే. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులో ఉంటారు. మొహమ్మద్ షమీతో పాటు నవదీప్ సైనీని తీసుకుంటే శార్దూల్ ఠాకూర్కు నిరాశ తప్పదు. ఒకవేళ టీ20లు, టెస్టు సిరీస్లను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, షమీలో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు శార్దూల్కు తొలి వన్డేలో ఆడే అవకాశం లభిస్తుంది.
'అతడు 5 రెట్లు మెరుగయ్యాడు!! టాప్ ఆర్డర్లో రాణిస్తాడు.. ఫినిషర్గానూ సత్తాచాటగలడు'