
ఆసీస్ టూర్కు వెళ్లకుండా..
ఇక లీగ్ పూర్తయిన వెంటనే ఆసీస్ టూర్కు ఎంపికైన ఆటగాళ్లంతా నేరుగా అక్కడికి వెళ్లగా రోహిత్ మాత్రం భారత్కు వచ్చాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో సహచర పేసర్ ఇషాంత్ శర్మతో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. దాంతో ఈ ఇద్దరు సిరీస్లో పాల్గొనడం ప్రశ్నార్థకంగా మారింది. తొలి రెండు టెస్ట్లకు దూరమవుతున్నారని కూడా బీసీసీఐ ప్రకటించింది.

తండ్రికి కరోనా సోకడంతో..
దాంతో అసలు రోహిత్ను భారత్కు ఎవరు పంపించారనే చర్చ ఊపందుకుంది. అంతర్జాతీయ సిరీస్ల కన్నా బీసీసీఐకి ఐపీఎల్ ఎక్కువైందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. దాంతో రోహిత్ను తాము ఎన్సీఏకు వెళ్లమని చెప్పలేదని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. ఈ వరుస పరిణామాలతో అసలేం జరుగుతుందో అభిమానులకు అర్థం కావడంలేదు. ఈ క్రమంలో రోహిత్ స్వదేశానికి తిరిగి రావడానికి గాయం లేదా మరో కమిట్మెంట్ ఏదీ కారణం కాదని, అతని తండ్రికి కరోనా సోకడంతోనే భారత్కు తిరిగొచ్చాడని ప్రముఖ క్రికెట్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది.

అందులో వాస్తవం లేదు..
అయితే రోహిత్ శర్మకు రెడ్ బాల్ సిరీస్ ఆడాలనే ఉద్దేశం లేదనే వాదనలో వాస్తవం లేదని కూడా మజుందార్ స్పష్టం చేశాడు. హిట్ మ్యాన్ అలా భావిస్తే అసలు ఎన్సీఏకే వెళ్లేవాడు కాదని, హాయిగా ఇంట్లో సతీమణి రితికాతో గడిపేవాడని పేర్కొన్నాడు. ఇక డిసెంబర్ 11న మరోసారి రోహిత్ శర్మ ఫిట్నెస్ను సమీక్షించనున్నారు. కానీ ఆస్ట్రేలియా వెళ్లాక మరో 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ నేరుగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి ఉంటే.. అక్కడే టీమిండియా ఫిజియో సమక్షంలో ట్రైనింగ్ తీసుకొని ఉండుంటే.. టెస్టు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండేవాడు. కానీ అతడు భారత్ తిరిగొచ్చేయడంతో టెస్టు సిరీస్లో ఆడే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications
