
బెంగళూరు: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు ఎంపికైన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ ట్రైనింగ్ ఆరంభించాడు. తొడకండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్.. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ కోసం సెలెక్టర్లు తొలుత ప్రకటించిన జట్టులో రోహిత్కు చోటు దక్కలేదు. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ను పూర్తిగా పక్కన పెట్టారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్లో రెండు మ్యాచ్లు ఆడిన రోహిత్ తనకే గాయమూ లేదని ప్రకటించాడు. రోహిత్ పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తున్నా.. బీసీసీఐ మాత్రం అతడు కోలుకోవడానికి మరింత సమయం అవసరమని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఫైనల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో ఆసీస్ టూర్కు రోహిత్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అనేక ప్రశ్నలు తలెత్తాయి. దాంతో సెలెక్టర్లు అతడి పేరును టెస్టు జట్టులో చేర్చి.. పరిమిత ఓవర్ల క్రికెట్కు మాత్రం దూరం పెట్టారు.
ఆసీస్తో ఫస్ట్ టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానుండటంతో రోహిత్ ఫిట్నెస్పై మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రోహిత్తో పాటు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిలిటేషన్లో ఉన్నాడు. ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాకే వీళ్లు ఆసీస్ వెళ్తారు. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్లో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు,4 టెస్ట్లు జరగనున్నాయి. జనవరిలో టెస్ట్ సిరీస్ జరగనుంది.