
మెల్బోర్న్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ 8 వికెట్లతో ఘనవిజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ టెయిలండర్ జోష్ హజల్వుడ్ను ఆఖరి వికెట్గా తీసిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్లో ఎక్కువ మంది లెఫ్టార్మ్ బ్యాట్స్మెన్ను ఔట్ చేసిన బౌలర్గా నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డును అధిగమించాడు.
అశ్విన్ ఇప్పటి వరకు టెస్ట్ల్లో 375 వికెట్లు తీయగా.. అందులో 192 మంది లెఫ్టార్మ్ బ్యాట్స్మెన్ ఔట్ చేశాడు. ఇక 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ 191 మంది ఏడమచేతి వాటం ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. వీరి తర్వాత ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్(186), గ్లేన్ మెక్గ్రాత్ (172), షేన్ వార్న్ (172), అనిల్ కుంబ్లే (167) ఈ లెఫ్టార్మ్ బ్యాట్స్మెన్ను ఔట్ చేసిన జాబితాలో ఉన్నారు.
డే/నైట్ టెస్టులో 36/9 స్కోర్తో పరువు తీసుకున్న టీమిండియా దెబ్బ తిన్న పులిలా పంజా విసిరింది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్పై పర్ఫెక్ట్ రివేంజ్ తీర్చుకుంది. సమష్టి ప్రదర్శనతో చెలరేగి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. 70 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. శుభ్మన్ గిల్(36 బంతుల్లో 35 నాటౌట్), అజింక్యా రహానే(40 బంతుల్లో 27) భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరొక వికెట్ తీశారు. ఈ గెలుపుతో నాలుగు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ 1-1తో సమం అయింది. సెంచరీ హీరో రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది.