14 రోజుల పాటు క్వారంటైన్:
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు ఎప్పుడు ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్తారనేది ఇప్పటి వరకూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో వారిద్దరూ సోమవారమే ఆసీస్ బయల్దేరకపోతే.. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే తొలి వార్మప్ మ్యాచ్కు దూరం అవుతారు. డిసెంబర్ 6-8 తేదీల మధ్య డ్రమ్మోయిన్ ఓవల్లో జరగనుంది. డిసెంబర్ 11న రెండో వార్మప్ మ్యాచ్ జరగనుంది.
నాలుగు రోజుల్లో బయలుదేరాలి:
'రోహిత్ శర్మ వైట్ బాల్ సిరీస్లకు లేడు. అతడు ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే విషయంపై ఎన్సీఏ మెడికల్ టీం ఆలోచిస్తున్నారు. కానీ అతడికి ఎక్కువ కాలం విశ్రాంతి కూడా ఇవ్వలేం. టెస్టు సిరీస్కు ఆడాలనుకుంటే.. రోహిత్ మూడు నుంచి నాలుగు రోజుల్లో బయలుదేరాలి. లేనిపక్షంలో అవకాశాలు కఠినంగా మారుతాయి. అయితే ఆసీస్కు బయలుదేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటే క్వారంటైన్ నిబంధనలతో తర్వాత సవాలుగా మారుతుంది. అప్పుడు టెస్టు సిరీస్కు ఆడే అవకాశాలు సంక్లిష్టం అవుతాయి' అని రవిశాస్త్రి తెలిపాడు.
ఇషాంత్ శర్మ సైతం:
టెస్టు సిరీస్లో ఆడటానికి ముందు ఇషాంత్ శర్మ సైతం కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇదివరకే రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టెస్టు సిరీస్ ఆడటానికి తాను ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పాడు. కానీ తనకు కొంత స్థైర్యం, కండీషనింగ్ వర్క్ అవసరమని తెలిపాడు. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా తొలి డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం అవుతుంది. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
అలాంటి మధుర క్షణాలు మళ్లీమళ్లీ రావు:
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి వెళ్లనుండటం గురించి రవిశాస్త్రి మాట్లాడాడు. 'కోహ్లీ సరైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలాంటి మధుర క్షణాలు మళ్లీమళ్లీ రావు. ఆ సమయంలో స్వదేశానికి చేరుకున్నందుకు ఎంతో సంతోషిస్తాడు. గత ఐదు, ఆరేళ్లలో జట్టును అతడు విజయపథంలో నడిపించాడు. కాబట్టి అతడి గైర్హాజరీ జట్టుకు లోటే. అయితే అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువకులు ఇది ఉపయోగపడుతుంది' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
India vs Australia: 'జట్టులో నా పేరు ఎందుకు లేదని గదిలోనే కూర్చున్నా.. ఒక్కసారిగా ఏడ్చేశా'