
విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం వైజాగ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న ఆసీస్.. విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది.
అయితే ఈ మ్యాచ్కు వర్షం భారీ అడ్డంకిగా మారనుంది. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే వైజాగ్లో వర్షం కురవగా.. మ్యాచ్కు సిద్దం చేసిన పిచ్పై కవర్స్ కప్పి ఉంచారు.
మ్యాచ్ జరిగే ఆదివారం కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. విశాఖ పట్నంలో ఆదివారం పగటి పూట 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. రాత్రి 23 డిగ్రీల సెల్సియస్కు పడిపోనుంది. ఉరుములతో కూడిన వర్షం పడనుంది. పగటి పూట 80 శాతం వర్షం పడనుండగా.. రాత్రి వేళలో 49 శాతం పడనుంది. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమైన అంతరాయం కలిగించనుంది.
ఔట్ ఫీల్డ్ బాగుంటే.. ఓవర్లను కుదించి మ్యాచ్ను కొనసాగించే అవకాశం ఉంటుంది. లేకుంటే బంతి పడకుండానే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగిన చాలా రోజుల తర్వాత జరగనున్న అంతర్జాతీయ మ్యాచ్ చూడాలనుకున్న విశాఖ నగరవాసులకు నిరాశే ఎదురుకానుంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం విశాఖ ప్రజలు భారీ క్యూలైన్స్ కట్టారు. ఈ క్యూ లైన్స్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. వైఎస్ రాజశేఖర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదాన రికార్డులు కూడా భారత్కే అనుకూలంగా ఉన్నాయి.