India vs Australia: హమ్మయ్యా.. మ్యాచ్ డ్రా అయింది!

సిడ్నీ: కళ్ల ముందు 407 పరుగుల భారీ లక్ష్యం..! 98 రన్స్కే రెండు కీలక వికెట్లు పడ్డాయి.. మరో ఇద్దరు బ్యాట్స్మెన్ గాయాలతో బాధపడుతున్నారు. ఇంకా చేయాల్సిన పరుగులు 309..! ఒక్క రోజు ఆట మొత్తం మిగిలి ఉంది. ఎదురుగా చూస్తే ప్రపంచస్థాయి బౌలింగ్ అటాక్.. ఇన్ని ప్రతికూలతల మధ్య సిడ్నీ టెస్ట్ను భారత్ కాపాడుకుంటుందా? గెలుపు సంగతిని పక్కన బెడితే కనీసం డ్రాతోనైనా గట్టెక్కుతుందా? చివరి రోజు ఆట ముందు ప్రతీ సాధారణ అభిమాని మదిలో మెదిలిన సందేహం.! కానీ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్( 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) వన్డే తరహా బ్యాటింగ్.. చతేశ్వర్ పుజారా(205 బంతుల్లో 12 ఫోర్లతో 77) క్లాస్ ఇన్నింగ్స్ ఈ అనుమానాలన్నిటినీ పటాపంచల్ చేసింది. ఓ దశలో వీరి బ్యాటింగ్ జోరు చూస్తే భారత్ విజయం ఖాయమనిపించింది. కానీ ఈ ఇద్దరూ ఔటవ్వడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో హనుమ విహారీ(161 బంతుల్లో 23 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్) అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్ భారత్ను ఓటమి నుంచి గట్టెక్కించింది. 98/2 ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్.. ఆట ముగిసే సమయానికి 131 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేయడంతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. దాంతో నాలుగు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ తీశాడు.

ఆదిలోనే గట్టి షాక్..
ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యంతో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్నైట్ స్కోర్98/2కు మరో నాలుగు పరుగులు జోడించిన వెంటనే కెప్టెన్ అజింక్యా రహానే (18 బంతుల్లో 4)మూడో వికెట్గా వెనుదిరిగాడు. నాథన్ లయన్ బౌలింగ్లో మాథ్యవేడ్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్.. దూకుడుగా ఆడాడు. వన్డే తరహా బ్యాటింగ్తో ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. ఆసీస్ ఫీల్డర్లు ఇచ్చిన రెండు లైఫ్లను సద్వినియోగం చేసుకున్న పంత్.. తనదైన శైలిలో చెలరేగాడు.

పుజారా- పంత్ రికార్డు భాగస్వామ్యం..
హాఫ్ సెంచరీ అనంతరం మరింత చెలరేగిన పంత్.. సెంచరీకి అతి దగ్గరగా వచ్చి మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. లయన్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 148 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే భారత్ తరఫున నాలుగో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా పుజారా-పంత్లు గుర్తింపు పొందారు. గతంలో ఈ రికార్డు రుసి మోడీ-విజయ్ హజారేల(139) పేరిట ఉండగా.. తాజాగా పంత్-పుజారాలు అధిగమించారు. ఇక పంత్ ఔటైన కొద్దిసేపటికే పుజారా కూడా ఔటయ్యాడు. హజెల్ వుడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. దాంతో భారత్పై ఒత్తిడి పెరిగింది.

విహారీ-అశ్విన్ సూపరో సూపర్..
కానీ హనుమ విహారీ, అశ్విన్ అద్భుత బ్యాటింగ్తో భారత జట్టును ఒడ్డుకు చేర్చారు. 43 ఓవర్ల పాటు నిర్విరామంగా బ్యాటింగ్ చేసి ఓటమిని తప్పించారు. ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. వీరిని ఔట్ చేయడానికి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. బౌలర్లను మార్చినా.. ఫీల్డింగ్ సెటప్ చేంజ్ చేసినా ఈ ఇద్దరు అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యారు. 43 ఓవర్లలో 62 పరుగులే చేశారంటే వారి బ్యాటింగ్ ఎంత నిదానంగా సాగిందో అర్థమవుతుంది.

సంక్షిప్త స్కోర్లు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 338 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్ 244 ఆలౌట్
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ 312/6 డిక్లేర్డ్, భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 334/5
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications