న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్కు చేరుకొని బెంగళూరు వేదికగా సన్నాహకాలు మొదలుపెట్టింది. బెంగళూరు సమీపంలో ఆలూరు వేదికగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్లో టర్నింగ్ ట్రాక్స్పై కసరత్తులు చేస్తోంది. మరోవైపు భారత జట్టు కూడా నాగ్ పూర్ వేదికగా ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొంది.
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన సీనియర్ ఆటగాళ్లు, ఈ సిరీస్కు ఎంపికైన ప్లేయర్లు గురువారం నాగ్పూర్కు చేరుకున్నారు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఈ సిరీస్ చివరి మ్యాచ్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు భారత ప్రధానితో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా హాజరవుతారని బోర్డు వర్గాలు తెలిపాయి. మార్చి 9-13 వరకు జరిగే ఈ మ్యాచ్ను ఇద్దరు ప్రధానులు ప్రత్యక్షంగా వీక్షిస్తారని పేర్కొన్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఈ సిరీస్ గెలవడం కీలకం. 2-0తో లేడా 3-1తో ఆసీస్ను ఓడిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతోంది. అంతేకాకుండా టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. మరోవైపు వరుస సిరీస్లతో జోరు మీదున్న ఆస్ట్రేలియా.. భారత్ను సొంతగడ్డపై ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా.. టర్న్ వికెట్పై ప్రాక్టీస్ చేస్తోంది. ఫిబ్రవరి 9- 13 మధ్య నాగ్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. ఫిబ్రవరి 17-21 మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్, మార్చి 1-5 ధర్మశాల వేదికగా మూడో టెస్ట్, మార్చి 9- 13: అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్ట్ జరగనుంది.