టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్లో ప్రసిధ్ కృష్ణ ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిధ్ కృష్ణ 68 పరుగులు సమర్పించుకున్నాడు. తాను వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ చెత్త గణంకాలతో యుజ్వేంద్ర చాహల్ను వెనక్కునెట్టాడు. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో యుజ్వేంద్ర చాహల్ 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఇదే చెత్త రికార్డ్.

ఓవరాల్గా ఈ జాబితాలో సౌతాఫ్రికా ప్లేయర్ కేజే అబాట్తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంక బౌలర్ కసున్ రజిత(75 రన్స్), క్రిస్ సోలె(స్కాట్లాండ్) 72 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. టురన్(తుర్కియే) 70 రన్స్, బారీ మెక్కార్తి(ఐర్లాండ్) 69 పరుగులతో ప్రసిధ్ కంటే ముందున్నారు.
పేలవ బౌలింగ్తో టీమిండియా పరాజయానికి కారణమైన ప్రసిధ్ కృష్ణపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే భారత జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్లతో 123 నాటౌట్) అజేయ శతకం సాధించగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), తిలక్ వర్మ(24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలుపొందింది. గ్లేన్ మ్యాక్స్వెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 104 నాటౌట్) శతకం నమోదు చేయగా.. మాథ్యూ వేడ్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రవి బిష్ణోయ్(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.