
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే/నైట్ టెస్ట్లో భారత జట్టు కీలక వికెట్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్ల ఆధిపత్యాన్ని ధీటుగా ఎదుర్కొంటూ క్రీజులో నిలదొక్కుకున్న టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా(160 బంతుల్లో 2 ఫోర్లతో 43) మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ వేసిన 50వ ఓవర్ నాలుగో బంతి పుజారా బ్యాట్, ప్యాడ్ను తాకుతూ గాల్లోకి లేచింది.
ఈ క్యాచ్ను లబుషేన్ అందుకోవడంతో ఆసీస్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. పుజారా కూడా ఔటని భావించి వెనుదిరిగే ప్రయత్నం చేశాడు. కానీ అంపైర్ మాత్రం ఆసీస్ అప్పీల్ను తిరస్కరించాడు. దాంతో రివ్యూకు వెళ్లిన ఆసీస్ ఆటగాళ్లు ఫలితాన్ని రాబట్టారు. దాంతో భారత్ 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
0/1 స్థితిలో క్రీజులోకి వచ్చిన పుజారా గొప్పగా పోరాడాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా డిఫెన్స్ చేస్తూ వారికి ఓపికకు పరీక్షగా నిలిచాడు. అయితే పుజారా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్లను ఆసీస్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న పుజారా అసలు సిసలు టెస్ట్ బ్యాట్స్మన్ను ఎలా ఉంటాటో చూపించాడు. తాను ఎదుర్కొన్న 148 బంతికి తొలి ఫోర్ కొట్టాడంటే పుజారా ఇన్నింగ్స్ ఎంత నిదానంగా సాగిందో అర్థమవుతుంది.
ఆ మరుసటి బంతిని కూడా బౌండరీకి తరలించి టచ్లోకి వచ్చినట్లు కనిపించిన పుజారా.. అంతలోనే ఔటవ్వడం భారత అభిమానులను నిరాశపరిచింది. ఓవరాల్గా 160 బంతులు ఆడిన పుజారా 2 ఫోర్లతో 43 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్కు 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.
ఇక క్రీజులోకి అజింక్యా రహానే రాగా.. టీ బ్రేక్ సమాయనికి భారత్ 55 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(109 బంతుల్లో 38 బ్యాటింగ్), అజింక్యా రహానే (17 బంతుల్లో 1 బ్యాటింగ్) ఉన్నారు. ఇక ఓపెనర్లు పృథ్వీ షా(0), మయాంక్ అగర్వాల్(17) తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.