
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్తో సంప్రదాయక ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన టీమిండియా యువ పేసర్ టీ నటరాజన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 44 రోజుల్లోనే 3 ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన భారత్ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ భారత్ అరుణ్ చేతుల మీదుగా 300వ టెస్ట్ క్యాప్ అందుకున్న నటరాజన్.. ఒకే పర్యటనలో టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్ల్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
టెస్టుల్లో 100వ క్యాప్ను బాలూ గుప్తే(1960-61) ధరించగా, 200వ టెస్టు క్యాప్ను నయాన్ మోంగియా(1993-94) అందుకున్నాడు. తాజాగా నట్టూ 300వ క్యాప్ను ధరించాడు. 9 ఏళ్ల క్రితం భారత్ తరఫున చివరిసారిగా ఒక లెఫ్టార్మ్ సీమర్ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2010-11 సీజన్లో దక్షిణాఫ్రికాతో జయదేవ్ ఉనాద్కత్ అరంగేట్రం చేశాడు. ఆపై ఇంతకాలానికి మళ్లీ నటరాజన్ ఒక లెఫ్టార్మ్ సీమర్గా టెస్టుల్లో డెబ్యూ ఆడుతున్నాడు. కాగా.. ఒక లెఫ్టార్మ్ సీమర్ భారత్ తరఫున చివరిసారిగా ఆడింది మాత్రం 2013-14 సీజన్లో మాత్రమే. న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా జహీర్ ఖాన్ భారత్ తరఫున టెస్టుల్లో చివరి సారిగా ఆడిన లెఫ్టార్మ్ పేసర్.
ఇక మ్యాచ్ విషయానికి కొస్తే.. యవ పేసర్లతో బరిలోకి దిగిన భారత జట్టు శుభారంభాన్ని అందుకుంది. ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1), మార్కస్ హ్యారిస్(5)లను పెవిలియన్ చేర్చింది. రోహిత్ శర్మ సూపర్ క్యాచ్తో వార్నర్ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేయగా.. మార్కస్ హ్యారిస్ను శార్దుల్ ఠాకుర్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత లబుషేన్, స్మిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అరంగేట్ర స్పిన్నర్ సుంధర్ విడదీశాడు. స్మిత్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి టెస్ట్ వికెట్ల ఖాతా తెరిచాడు.
ఆ తర్వా లబుషేన్ ఇచ్చిన రెండు క్యాచ్లను భారత ఫీల్డర్లు చేజార్చి మూల్యం చెల్లించుకున్నారు. ఈ అవకాశాలను అందుకున్న లబుషేన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని..సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 54 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(73 బ్యాటింగ్)తో పాటు మాథ్యూ వేడ్(27 బ్యాటింగ్) ఉన్నారు.