
న్యూఢిల్లీ: హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్కు గోల్డెన్ చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అన్నీ సజావుగా సాగితే త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో భారత్ తరఫున ఈ హైదరాబాద్ గల్లీ బాయ్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటిదాకా మూడు టీ20లు, ఓ వన్డే మ్యాచ్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సిరాజ్కు.. ఐదో పేసర్గా టెస్ట్ టీమ్ స్థానం దక్కేలా ఉంది. అయితే ముంబైకే చెందిన శార్ధుల్ ఠాకూర్ నుంచి అతనికి గట్టిపోటీ ఎదురుకానుంది.
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. వచ్చే ఏడాది జనవరిలో ముగిసే ఈ సుదీర్ఘ పర్యటనలో ఇరు దేశాల మధ్య నాలుగు టెస్ట్లు జరగనున్నాయి. వాటి కంటే ముందు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఉంటాయి. కరోనా ముప్పు, క్వారంటైన్ రూల్స్ నేపథ్యంలో ఓ జంబో టీమ్ను ఆసీస్కు పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ పర్యటనకు జట్టును ఎంపిక చేసేందుకు సునీల్ జోషీ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ వీకెండ్లో సమావేశం కానుంది.
సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ ఐపీఎల్లో గాయపడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. వీరి గైర్హాజరీతో నాలుగో పేసర్గా నవ్దీప్ సైనీకి అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఐదో పేసర్గా మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకుర్ల మధ్య పోటీ నెలకొంది. రంజీ ట్రోఫీ, భారత్ 'ఎ' జట్ల తరఫున సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చగా.. కొత్త బంతిని ఠాకూర్ చక్కగా స్వింగ్ చేయగలడు. కానీ సెలెక్టర్లు, కెప్టెన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఇక సిరాజ్కే ఎక్కువ అవకాశం ఉందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. గత కొన్ని సీజన్లుగా భారత్-ఏ తరఫున సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని, ఆసీస్ పిచ్లకు అతను సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్కు ఆడుతున్న సిరాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వికెట్లు తీస్తున్నా పరుగులు ఎక్కువగా ఇస్తూ జట్టులో చోటునే కోల్పోయాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లే ఆడిన సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. అయితే కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగులిచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు.