ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుపై ఆ దేశ మీడియా తమ అక్కసును వెళ్లగక్కుతోంది. భారత ఆటగాళ్లనే టార్గెట్ చేస్తూ కొత్త వివాదాలకు తెరలేపుతోంది. దాంతో మెల్బోర్న్ వేదికగా ఆసీస్ మీడియా వర్సెస్ భారత మీడియా మధ్య జరగాల్సిన ఎగ్జిబిషన్ టీ20 క్రికెట్ మ్యాచ్ రద్దయ్యింది.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై ఆసీస్ మీడియా తమ విద్వేశాన్ని వెల్లగక్కింది. తాజాగా మెల్ బోర్న్ వేదికగా జరగాల్సిన ఎగ్జిబిషన్ మ్యాచ్ రద్దవ్వడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కెంది. ఈ సిరీస్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు గెలవగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి.

గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయ్యింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు మెల్బోర్న్ చేరి సాధన చేస్తున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో రవీంద్ర జడేజా శనివారం మీడియాతో మాట్లాడాడు. భారత మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే అతను హిందీలో సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఆసీస్ మీడియా ప్రశ్నలకు బదులివ్వలేదు.
ఇంగ్లీష్లో మాట్లాడలేదు. దాంతో ఆసీస్ మీడియా నిరసన వ్యక్తం చేసింది. టీమ్ బస్ వెళ్లడానికి సిద్దంగా ఉందని, జడేజా ఇక మాట్లాడలేడని టీమిండియా మేనేజర్ చెప్పినా ఆసీస్ మీడియా పట్టించుకోలేదు. తమ ఛానెల్స్ వేదికగా జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆటగాళ్లు ఆసీస్ మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కథనాలు ప్రసారం చేసింది.
ఈ ఘటనతో ఆస్ట్రేలియా మీడియా, భారత మీడియా మధ్య మెల్ బోర్న్ వేదికగా జరగాల్సిన ఎగ్జిబిషన్ మ్యాచ్ రద్దయ్యింది. ఆసీస్ మీడియా తీరును నిరసిస్తూ.. టీమిండియా మీడియా మేనేజర్ ఈ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించాడు. భారత మీడియా కూడా అతన్ని అనుసరిస్తూ ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ను బాయ్కట్ చేసింది. రవీంద్ర జడేజా ఇంగ్లీష్ మాట్లాడలేడనే విషయాన్ని గ్రహించకుండా అతనిపై నిందలు వేయడంపై భారత మీడియా మండిపడింది.